గత ఏడాది శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. భారత్ సహా ప్రపంచ దేశాల ఆర్థిక సహాయంతో సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతోంది ఆ దేశం. తాజాగా శ్రీలంక దారిలోనే పాకిస్తాన్ కూడా వెళ్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ లో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. అక్కడ వంట గ్యాస్ కొనాలంటే జనానికి చుక్కలు కనబడుతున్నాయి. భారత్ లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1100 ఉంటేనే లబోదిబోమనే పరిస్థితి. అంతకు మించి ఒక్క రూపాయి పెరిగినా ధర్నాలు, రాస్తారోకోలు చేసే పరిస్థితి. అయితే పాకిస్తాన్ లో సిలిండర్ ధర ఏకంగా 10 వేల రూపాయలకు పైనే ఉంది. పాకిస్తాన్ కరెన్సీ ప్రకారం వంట గ్యాస్ కొనుగోలు చేయాలంటే అక్కడి ప్రజలు పదివేల రూపాయలు చెల్లించాలి. లేదంటే ఆకలితో అలమటించాల్సిందే.
మన కరెన్సీ ప్రకారం 3,652 రూపాయలు. మన కంటే 3 రెట్లు అధికంగా అక్కడ సిలిండర్ ధర ఉంది. తీవ్ర ద్రవ్యోల్బణం కారణంగా అక్కడ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. కొనాలంటే వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. వంట గ్యాస్ కొరత ఏర్పడడంతో ప్రజలకు వంట గ్యాస్ ని సరఫరా చేయలేక ప్రభుత్వం ఇక్కట్లు పడుతోంది. దీంతో వంట గ్యాస్ డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోతలు కూడా విధించింది. ప్రభుత్వ ఆస్తులను అమ్మే ప్రయత్నం చేస్తోంది. విద్యుత్ సంక్షోభంతో దేశమంతా మార్కెట్లు, మాల్స్ ని రాత్రి 8.30 వరకే ఉంచాలని, ఆ తర్వాత మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇది ఇలానే కొనసాగితే పాక్ ప్రజల పరిస్థితి మరీ ఘోరంగా తయారవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రోజులు గడిచే కొద్దీ వంట గ్యాస్ ధర 12 వేలు, 15 వేలు, 20 వేలు ఇలా పెరుగుతూ వెళ్ళిపోతుంది. మరి పాకిస్తాన్ ని ఈ సంక్షోభం నుంచి బయటపడేసేది ఎవరు? ఆర్థిక క్రమశిక్షణ అనేది లేకపోతే వ్యవస్థలు విచ్చిన్నమైపోతాయనడానికి శ్రీలంక, పాకిస్తాన్ దేశాలే ఇందుకు నిదర్శనం. మరి మన పొరుగు దేశమైన పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంపై మీ అభిప్రాయం ఏమిటి? పాలకుల వైఫల్యం గురించి మీ అభిప్రాయమేమిటి? వంట గ్యాస్ ధర 10 వేలు ఉండడంపై మీ అభిప్రాయం ఏమిటి? రానున్న రోజుల్లో ఏ దేశాలు ఆర్థిక సంక్షోభంలో పడనున్నాయి? ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? మీ అభిప్రాయాలేంటో కామెంట్ చేయండి.