ఆఫ్రికా దేశమైన సూడాన్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బంగారం గని కూలిన ఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని ఖార్టూమ్కు దక్షిణంగా 700 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఫుజా గ్రామంలో మూసి ఉన్న గనిలో ప్రమాదం జరిగిందని సూడాన్ ప్రభుత్వ మైనింగ్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రమాదంలో మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారని, వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
బంగారం స్మగ్లింగ్ ఆరోపణల నేపథ్యంలో.. గత రెండేళ్లలో సుడాన్ ప్రభుత్వం గోల్డ్ అక్రమ తవ్వాలను నియంత్రిస్తోంది. ఈ క్రమంలోనే ఫుజా గ్రామంలోని ఈ బంగారం గనిని మూసివేశారు. కొన్నాళ్ల పాటు సెక్యూరిటీని అలాగే ఉంచారు. ఐతే కొన్ని నెలల క్రితం సెక్యూరిటీ సిబ్బందిని కూడా వెనక్కి పిలిచారు. అప్పటి నుంచి స్థానిక ప్రజలు బంగారం కోసం ఆ గనిలో తవ్వకాలు జరిపేవారు. ప్రమాదం అని తెలిసినా బంగారం కోసం ప్రాణాలను పణంగా పెట్టి గాలిస్తున్నారు.
సూడాన్లో ఇప్పటికే పలుమార్లు బంగారు గనులు కూలిపోవడంతో చాలా మంది మృతి చెందారు. అక్కడి ప్రభుత్వం బంగారు గనులపై ప్రత్యేక దృష్టి సారించి గనులు కూలకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు పలు మార్లు విన్నపాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. గని కూలకుండా ప్రభుత్వం ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఆఫ్రికా ఖండంలో బంగారం వెలికితీతకు సూడాన్ ప్రధాన ఉత్పత్తిదారుగా ఉంది. 2020లో ఇక్కడ 36.6 టన్నుల బంగారాన్ని వెలికితీశారు.