ఎర్ర బంగారం అలియాస్ టమాటా సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు కలవరపెడుతుంది. అందనంత ఎత్తుకు ఎదిగి.. మరింత రుచిగా మారుతోంది. ఎన్నడూ లేని విధంగా కేజీ టమాటా ధర రూ. 200 పై చిలుకు పలుకుతోంది. టమాటా ధరలు పెరగడంతో వాటి వాడకాన్ని తగ్గించేసినట్లు
Fఎర్ర బంగారం అలియాస్ టమాటా సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు కలవరపెడుతుంది. అందనంత ఎత్తుకు ఎదిగి.. మరింత రుచిగా మారుతోంది. ఎన్నడూ లేని విధంగా కేజీ టమాటా ధర రూ. 200 పై చిలుకు పలుకుతోంది. టమాటా ధరలు పెరగడంతో వాటి వాడకాన్ని తగ్గించేసినట్లు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి అన్నాడంటే.. తీవ్రత ఎలా ఉందో చెప్పనక్కర్లేదు. వరలక్ష్మి శరత్ కుమార్, ఇతరులు కూడా వీటిపై ఫన్నీ వీడియోలు చేసి పోస్టు చేస్తున్నారు. ఈ టమాటా కారణంగా హత్యలు జరిగాయి. ఈ టమాటా వల్ల కాస్త లాభ పడింది అన్నదాతే. మునుపెన్నడి చూడని విధంగా ఈ పంట రైతు ఇంట సిరులు కురిపిస్తోంది. అయితే ఈ టమాటాలో కొంత మంది వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. వింత సంఘటనలు చోటుచేసుకున్న సంగతి విదితమే.
కూతురుకు 51 కేజీల టమాటాలతో తులాభారాన్ని వేసిన ఓ తండ్రి.. ఆమెపై తనకున్న ప్రేమను చెప్పకనే చెప్పాడు. అలాగే రెండంటే రెండు టమాటాలను తనకు తెలియకుండా కూరలో వాడాడని భర్తను వదిలేసి వెళ్లిపోయిందో ఇల్లాలు. అంతేనా తన కుమార్తె పుట్టిన రోజు పురస్కరించుకుని 400 కేజీల ఎర్రటి పండ్లను పంచాడో వ్యక్తి. మొన్నటి మొన్న కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కిలోల కొద్ది టమాటాలను ఉచితంగా పంపిణీ చేసిన సంగతి విదితమే. తాజాగా ఓ ఫోటోగ్రాఫర్ ఓ వినూత్న ఆలోచన చేశాడు. టమాటాను వ్యాపార సూత్రంగా మలుచుకున్నాడు. తన ఫోటో స్టూడియోకు ఫోటోలు దిగే వాళ్లు రాకపోవడంతో ఓ బంపర్ ఆఫర్ ప్రకటించాడు.
ఇంతకూ ఆ ఆఫర్ ఏంటంటే..? తన స్టూడియోలో పాస్ పోర్టు సైజ్ ఫోటోలు దిగితే పావు కిలో టమాటా ఉచితంగా ఇస్తానంటూ ప్రకటించాడు. ఇంతకు ఆ ఫోటో గ్రాఫర్ది ఏ ఊరు అంటే తెలంగాణలోని కొత్త గూడెం. ఆనంద్ అనే వ్యక్తి కొత్తగూడెం బస్టాండ్ కాంప్లెక్స్లో ఫోటో స్టూడియో నిర్వహిస్తున్నాడు. స్టూడియోకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోవడంతో వినూత్న ఆలోచన చేశాడు. తన వద్ద రూ. 100 వెచ్చించి పాస్ పోర్టు సైజ్ ఫోటోలు 8 తీసుకున్న వారికి పావు కిలో టమాటా ఉచితం అంటూ ప్రకటించడమే కాకుండా.. బ్యానర్లు కూడా కట్టించాడు. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ వినూత్న ప్రచారానికి మంచి స్పందన లభించిందని ఆనంద్ చెబుతున్నారు. బుధవారం ఒక్క రోజే.. 32 మంది వినియోగదారులు వచ్చి..ఫోటోలు దిగారని, వారికి 40 రూపాయల విలువైన టమాటాలు అందించినట్లు చెప్పారు. భవిష్యత్తులో దీన్ని కొనసాగిస్తానని తెలిపారు.