తియ్యటి మాటలు ఎవరిలోనైనా ఆశ పుట్టిస్తాయి. ఆ మాటలనే ఇద్దరు అందమైన మహిళలు చెప్తే.. ఇంకేముంది ఎవరైనా తప్పకుండా వాళ్ళని నమ్మేస్తారు. హైదరాబాద్ లోని ఇద్దరు కిలాడీ లేడీలు ఇలాంటి వ్యూహాన్ని పన్నే 950 మందిని బుట్టలో వేసుకున్నారు. ఇంత మంది.. ఇద్దరు మహిళల చేతిలో ఎలా మోసపోయారు? అసలు వీరు చెప్పిన ఆ తియ్యటి మాటలు ఏమిటి? అసలు ఎవరీ మహిళలు అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్ లోని బోరబండ ఏరియా. పేద, మధ్య తరగతి మనుషులు మాత్రమే నివశించే ప్రాణతం. అక్కడ సైట్– 3లో సోషల్ వర్కర్ సుప్రియ, ఓ సేవా ఫౌండేషన్ అధ్యక్షురాలు అయేషా తబస్సుంలు నివశిస్తున్నారు. పైకి మంచిగా కనిపించే వీరిద్దరూ ఈజీ మనీ కోసం భారీ స్కెచ్ వేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామని సుమారు 950 మంది నుండి రూ.లక్షలు వసూలు చేశారు. వీరికి ఆ ప్రాంతంలో కాస్త మంచి పేరు ఉండటం, లోకల్ నాయకులతో క్లోజ్ గా ఉండటంతో జనం అంతా ఈ కిలాడీ లేడీలని సులభంగా నమ్మేశారు.
ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు మాత్రమే కాదు.., ఫించన్ల దగ్గర నుండి ఆధార్ కార్డు వరకు, కళ్యాణలక్ష్మి నుండి రేషన్ కార్డ్స్ వరకు అన్నీ ఇప్పిస్తామని లక్షలు గుంజేశారు. చూడటానికి అమాయకంగా అనిపించే మొహాలు, పైగా.. చాలా ఏళ్లుగా పరిచయమున్న వ్యక్తులు కావడంతో అంతా వీరి ఉచ్చులో సులభంగానే చిక్కుకున్నారు. ఇలా సుమారు 1000 మంది దగ్గర నుండి లక్షలు వసూలు చేశారు. కానీ.., డబ్బులు ఇచ్చి మూడు నెలలు గడుస్తున్నా ఇల్లు విషయం తేలకపోవడంతో స్థానికులు సుప్రియని నిలదీశారు.
ఆమె నుండి సరైన సమాధానం లేకపోవడంతో.. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు సుప్రియని అరెస్ట్ చేశారు. కానీ.., విచారణలో అయేషా తబస్సుం పేరు కూడా బయటకి రావడంతో పోలీసులకి అసలు నిజాలు తెలిశాయి. ప్రస్తుతం ఏ1 గా అయేషా తబస్సుం, ఏ2 గా సుప్రియలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చూశారు కదా..? ఇంత మందిని మోసం చేసిన ఈ కిలాడీ లేడీలకి ఎలాంటి శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.