విజయవాడ- అతడికి పెళ్లై.. భార్య ఉన్నా, వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంపై భార్య నిలదీయడంతో ఆమెను ఇంట్లో నుంచి గెంటేశాడు. ఇంట్లో సదరు మహిళతో ఏకంగా కాపురమే పెట్టేశాడు. ఇటువంటి సమయంలో భార్య పేరు మీద పొదుపు రుణం మంజూరైంది. దీంతో ఏంచేయాలో పాలుపోక, డబ్బు మీద ఆశతో వివాహేతర సంబందం పెట్టుకున్న మహిళను భార్యగా నమ్మించి బ్యాంకు నుంచి పొదుపు రుణం డబ్బులను కాజేశాడు ఆ ప్రబుద్దుడు.
అసలు విషయం తెలిసి భార్య వచ్చి అడిగితే బ్యాంక్ ఉద్యోగులు నోరెళ్ల బెట్టారు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. విస్సన్నపేట మండల కేంద్రమైన విస్సన్నపేటకు చెందిన శ్రీను, నిర్మల భార్యభర్తలు. శ్రీను వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భార్యభర్తల మధ్య తీవ్ర గొడవలయ్యాయి. దీంతో మూడు నెలల కిందట శ్రీను తన భార్య నిర్మలను ఇంటి నుంచి గెంటేశాడు.
ఆ తరువాత కొన్ని రోజులకు భార్య నిర్మల సభ్యురాలిగా ఉన్న పొదుపు గ్రూపునకు 10 లక్షల లోన్ మంజూరైంది. గ్రూపులో పది మంది సభ్యులుండటంతో ఒక్కొక్కరికీ లక్ష చొప్పున వారి ఖాతాలో జమ చేశారు. కానీ భార్య నిర్మల పుట్టింటికి వెళ్లడం, లోన్ కోసం మళ్లీ ఆమెను పిలవడానికి మొహమాటపడ్డ శ్రీను ఓ పధకం వేశాడు. నిర్మల బ్యాంక్ పాస్ పుస్తకంలో ఆమె ఫొటోను తీసేసి, తాను సంబంధం పెట్టుకున్న మహిళ ఫొటో అతికించాడు.
ఇంకేముంది బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్లి ఆ మహిళనే తన భార్యగా నమ్మించి నగదు మొత్తాన్ని విత్ డ్రా చేసుకున్నాడు. కాస్త ఆలస్యంగా విషయం తెలుసుకున్న నిర్మల బ్యాంక్ అధికారులను ప్రశ్నించింది. అప్పటికే శ్రీను నగదు డ్రా చేసి సదరు మహిళతో పాటు పారిపోయాడు. తమ తప్పు తెలుసుకున్న బ్యాంక్ అధికారులు గ్రామ పెద్దల సాయంతో నిర్మలతో రాజీ కుదుర్చుకుని, ఆమె పేరుతో కొత్త అకౌంట్ తెరిచి కొంత నగదు జమ చేయడంతో వివాదం సద్దుమణిగింది.