ప్రజలకి చేయాల్సిన పనుల విషయంలో ప్రభుత్వ అధికారులు ఒక్కోసారి తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఒక్కోసారి చిన్న చిన్న సర్టిఫికెట్స్ కోసం నెలలు పాటు తిప్పించుకుంటారు. సామాన్యులకి ఈ లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంటుంది. తాజాగా ఏపీలో ఇలాంటి సంఘటన జరిగింది. తల్లిదండ్రిని కోల్పోయిన ఓ మైనర్ బాలిక తన తల్లి డెత్ సర్టిఫికెట్ కోసం నెలలు తరబడి అధికారుల చుట్టూ తిరిగినా.., ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో.., కన్నీరు పెట్టుకుంటూ ఆ చిన్నారి ఏకంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికే లేఖ రాసేసింది.
నెల్లూరు జిల్లా అల్లూరుకు చెందిన బిరుదవోలు నోషిత అనే బాలిక చిన్నప్పుడే తండ్రిని కోల్పోయింది. సరిగ్గా నెలరోజుల క్రితం తల్లి కూడా గుండెపోటుతో మృతి చెందింది. నోషిత తన తల్లి డెత్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంది. కానీ.., నోషిత తల్లి కరోనాతో చనిపోయిందన్న పుకార్లు రావడంతో, డాక్టర్ సర్టిఫికెట్ లేనిదే డెత్ సర్టిఫికెట్ జారీ చేయవద్దని అధికారులు ఆదేశించారు. దీంతో.., నోషిత అందరి చుట్టూ తిరిగి విసిగిపోయి చివరికి సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేఖరాసింది. ‘జగన్ మామయ్యా..! చిన్నప్పుడే తండ్రికి దూరమయ్యాను. కళ్లల్లో పెట్టుకొని చూసుకున్న తల్లి ప్రాణాలు కోల్పోయింది. మైనర్ని అయిన నేను అమ్మమ్మ సంరక్షణలో ఉంటున్నా. అమ్మ డెత్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నా. మంజూరు చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వేధిస్తున్నారు. విసిగిపోయి మానసికంగా కుంగిపోయాను” అంటూ లేఖ రాసింది. తన లేఖను రిజిస్టర్ పోస్టు ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపింది ఈ చిన్నారి.
ఈ లేఖ ద్వారా మొత్తం వ్యవహారాన్ని తెలుసుకున్న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని వెంటనే స్పందించారు. నెల్లూరు జిల్లా జెడ్పీ సీఈఓ పి సుశీల, DMHO డాక్టర్ రాజ్యలక్ష్మికి ఫోన్ చేసి నోషిత పని వెంటనే జరిగిపోయేలా చర్యలు తీసుకోండి అని ఆదేశించారు. దీంతో.., 15 నిముషాల్లో నోషితకు తన తల్లి అనుపమ పేరుతో డెత్ సర్టిఫికెట్ జారీ అయ్యింది. అధికారులు స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి నోషితకు డెత్ సర్టిఫికెట్ అందచేయడం విశేషం. ప్రభుత్వ కార్యాలయాలలో పనులు సకాలంలో పూర్తి అవ్వడానికే జగన్ సచివాలయాలను, వాలంటరీ వ్యవస్థని తీసుకొచ్చారు. ఇన్ని వ్యవస్థలు ఉండి కూడా.. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఇంకా ప్రదక్షణ చేయాల్సి వస్తుందనడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ.