ఏడాదిన్నర నుండి ఎదురు చూస్తున్న చూపులకు తెర పడింది. ఎప్పుడెప్పుడు ఆ పథకం అమలు అవుతుందా అని కళ్లు విప్పార చూశారు ఆ రాష్ట్రంలోని యువతులు, మహిళలు. ఎట్టకేలకు వారి ఆశలను నెరవేర్చేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది.
ఏడాదిన్నర నుండి ఎదురు చూస్తున్న చూపులకు తెర పడింది. ఎప్పుడెప్పుడు ఆ పథకం అమలు అవుతుందా అని కళ్లు విప్పార చూశారు ఆ రాష్ట్రంలోని యువతులు, మహిళలు. ఎట్టకేలకు వారి ఆశలను నెరవేర్చేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇంతకు ఆ పథకం ఏంటనుకుంటున్నారు స్మార్ట్ ఫోన్ల అందజేత. సుమారు ఈ పథకం కింద కోటి నలభై లక్షల మంది లబ్దిపొందనున్నారు. అయితే పలు దశల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఇంతకు ఈ స్మార్ట్ ఫోన్లను అందజేస్తున్న ప్రభుత్వం ఏదంటే.. రాజస్థాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టడం గమనార్హం.
గతేడాది రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇందిరాగాంధీ ఉచిత స్మార్ట్ ఫోన్ పథకం కింద రాష్ట్రంలోని మహిళలకు ఉచిత స్మార్ట్ ఫోన్లను అందిస్తామని ప్రకటించిన సంగతి విదితమే. ఇప్పుడు ఈ పథకాన్ని అమల్లోకి తెస్తున్నారు. ప్రస్తుతం బన్స్వారా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించారు. మొత్తం కోటి నలభై లక్షల మంది అర్హులైన లబ్దిదారులు ఉండగా.. తొలి విడతలో భాగంగా 40 లక్షల మందికి అందిస్తున్నారు. మొదటి దశలో ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి లేదా 12వ తరగతి చదువుతున్న విద్యార్థినుల కుటుంబాలకు లేదా ఉన్నత చదువుల కోసం కాలేజీకి వెళ్లే విద్యార్థినుల కుటుంబాలకు మాత్రమే స్మార్ట్ ఫోన్లు అందజేయనున్నారు.
ఇక రెండవ దశలో ఒంటరి మహిళలు, పింఛను పొందుతున్న మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో పాటు 2022-23 సంవత్సరంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MNREGA)100 రోజులు పనిచేసే కుటుంబానికి కూడా ఈ పథకం కింద స్మార్ట్ ఫోన్లు అందిస్తారు. అలాగే ఇందిరాగాంధీ పట్టణ ఉపాధి హామీ పథకం కింద 50 రోజులకు పైగా పని పూర్తి చేసుకున్న కుటుంబాలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు కూడా అందజేయనున్నారు. ఆధార్ కార్డులో ఉన్న మహిళ చనిపోతే ఆ పథకం కింద.. 18 ఏళ్లు నిండిన కొడుకు లేదా కుమార్తెకు స్మార్ట్ ఫోన్లు ఇస్తారు. ఈ పథకాన్ని పొందాలంటే అర్హులైన మహిళలు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆధారాలు పరిశీలించాక లబ్దిదారుల ఎంపిక జరుగుతుంది.