అనంతపురం- గుప్తనిధుల కోసం ఈ కాలంలోను చాలా చోట్ల తవ్వకాలు జరుపుతున్నారు. ఏళ్ల కింద ధనం, బంగారాన్ని పూర్వీకులు దాచి పెట్టారని చాలా మంది నమ్మకం. దీంతో గుప్తు నిధులకోసం పలు ప్రాంతాల్లో అన్వేషిస్తూనే ఉన్నారు. ఐతే కొన్ని చోట్ల గుప్తు నిధులు బయటపడ్డ సందర్బాలు కూడా ఉన్నాయి. ఐతే తవ్విన ప్రతి ప్రాంతంలో గుప్త నిధులు మాత్రం దొరకవని చాలా సందర్బాల్లో నిరూపితమైంది.
తాజాగా అనంతపురం జిల్లాలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం సృష్టించాయి. జిల్లాలోని దాదులూరులో కేశవయ్య, నాగరాజుకు 4.98 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. భూమి మధ్యలో ఉన్న నల్లటి బండ రాయిపై ఒకచోట లిపి ఉండటంతో గుప్త నిధులు ఉంటాయని భావించారు. శ్రీకృష్ణ దేవరాయలు కాలం నాటి ప్రాంతం కావడంతో ఒక శాసనం అర్థం కాని భాషలో ఉంది. శాసనం చుట్టూ నిధి ఉందని ప్రచారం జరగటంతో మొత్తం నలుగురు నిందితులు ముఠాగా ఏర్పడ్డారు.
ఇంకేముంది జేసీబీ సాయంతో తవ్వకాలు చేపట్టారు. రెండు మూడు రోజుల పాటు ప్రతి రోజు రాత్రి పూట తవ్వుతున్నారు. ఐతే ప్రతి రోజు రాత్రి పొలం దగ్గర నుంచి శభ్దాలు రావడంతో స్థానికులు ముందు భయపడ్డారు. నాలుగో రోజు గ్రామస్తులు కొంత మంది వెళ్లి చూడగా పొలం మధ్యలో రాయిని కొంత మంది తవ్వేస్తున్నారు. అప్పటికే నాలుగు అడుగుల మేర తవ్వకాలు జరిపారు. స్థానికులు వెంటనే పోలీసులకు పిర్యాదు చేయడంతో వాళ్లు రంగప్రవేశం చేశారు.
గుప్తు నిధుల కోసం ముఠాగా ఏర్పడ్డ నలుగురితో పాటు, వారికి సహకరించిన మరో ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు తవ్వకాల కోసం ఉపయోగించిన జేసీబీని సైతం పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ఇంకా ఈ ముఠా ఎక్కడెక్కడ తవ్వకాలు జరిపిందన్నదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.