మహిళా సాధికారికతకు అర్థాన్ని మార్చేస్తున్నారు కొంత మంది మహిళలు. మగవాళ్లతో పోల్చుకుని తాము ఎందులో తక్కువ కాదూ అని నిరూపించేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. మోసం చేయడంలో పిహెచ్డీ స్థాయిని దాటిపోతున్నారు.
మహిళా సాధికారికతకు అర్థాన్ని మార్చేస్తున్నారు కొంత మంది మహిళలు. మగవాళ్లతో పోల్చుకుని తాము ఎందులో తక్కువ కాదూ అని నిరూపించేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. మోసం చేయడంలో పిహెచ్డీ స్థాయిని దాటిపోతున్నారు. డబ్బుల కోసం మహా ముదుర్లుగా మారిపోయి.. అతి తెలివి తేటలతో పబ్బం గడుపుకునేందుకు అబద్దాల ఫ్యాక్టరీని స్థాపిస్తున్నారు. గతంలో మగవాళ్ల చేతుల్లో మోసపోయిన ఆడవాళ్ల గురించి కుప్పలు తెప్పలుగా వార్తలు చదివాం. కానీ నేడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఇటీవల కాలంలో మహిళల చేతుల్లో అమాయకులు మోసపోతున్న అనేక ఘటనలు చూశాం. ఇప్పుడు మరో అమ్మాయి.. ఏకంగా పెద్ద కథ అల్లి, అబ్బాయిని బుట్టలో వేసుకుని, మరో జంటను మోసం చేసి దొరికిపోయింది.
సినిమా మించిపోయిన కథను నడిపించిన ఈ మహిళది ఆదిలాబాద్ జిల్లా. వివరాల్లోకి వెళితే.. గోమాస శిరీష అలియాస్ అనూష చదువుల నిమిత్తం హైదరాబాద్ వచ్చింది. చదువుకునే సమయంలో సిద్దార్థ్ అనే యువకుడితో ప్రేమలో పడింది. తాను జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం చేస్తున్నానని చెప్పడంతో.. అతడూ పెళ్లి చేసుకున్నాడు. రోజు విధుల నిమిత్తం బయటకు వెళ్తున్నట్లు కలరింగ్ ఇచ్చేంది. భర్త నిజమోనని నమ్మసాగాడు. కాగా,ఆమెకు రెండు నెలల క్రితం మౌలాలికి చెందిన వాణిరెడ్డి ఓ రోజు మేడ్చల్ కలెక్టర్ కార్యాలయానికి రాగా, అనూష పరిచయం పెంచుకుంది. తాను వికారాబాద్ ఎమ్మార్వోగా పనిచేస్తున్నానని వాణికి చెప్పసాగింది. తన ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్ పోస్టు ఖాళీగా ఉందని, దానికి కొంత డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పింది.
అనూష చెప్పిన మాటలు నమ్మిన వాణి రెడ్డి.. తొలుత ఫోన్ పే ద్వారా రూ. 90 వేలు చెల్లించింది. అయితే వాణి భర్తకు కూడా ఆ ఆఫీసులోనే ఉద్యోగం ఇప్పిస్తానని వారి వద్ద నుండి మరో రూ. 1.60 లక్షలు వసూలు చేసింది. ఆ తర్వాత ఫేక్ ఆర్డర్ కాగితాలు సిద్ధం చేసి.. జాయిన్ అవ్వాలంటూ వారికి పంపింది. నిజమేనని భావించిన వాణి.. వాటిని తీసుకుని గత నెల 10న కలెక్టర్ ఆఫీసుకు వెళ్లారు. ఇంకేముందీ అక్కడ సిబ్బంది ఇవి ఫేక్ అని తేలడంతో లబోదిబోమన్నారు. వెంటనే వికారాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. కిలాడీ లేడీ అనూషను అదుపులోకి తీసుకుని, ఆమె వద్ద నుండి వాణి కుటుంబం నుండి వసూలు చేసిన రూ. 2.50 లక్షలను రికవరీ చేశారు.