రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో మహిళ హత్య కేసు ఎంతటి సంచలనం కలిగించిందో.. రోజుకోక మలుపు కూడా తీసుకుంటుంది. నివాసాల మధ్య ఓ మహిళా మృతదేహాం కాలిపోయి కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో మహిళ హత్య కేసు ఎంతటి సంచలనం కలిగించిందో.. రోజుకోక మలుపు కూడా తీసుకుంటుంది. నివాసాల మధ్య ఓ మహిళా మృతదేహం కాలిపోయి కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. శ్రీనివాస ఎన్క్లేవ్ సమీపంలోని ఓ బహిరంగ ప్రదేశంలో సగం కంటే ఎక్కువ కాలిన మహిళ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడటంతో నిందితుల కోసం సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించారు, డాగ్ స్వ్కాడ్ రంగంలోకి దింపారు. ఇంతకు ఆ మహిళ ఎవరు అన్న కోణంలో విచారణ జరగ్గా.. శంషాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని రాళ్లగూడ దొడ్డికి చెందిన వడ్ల మంజులగా పోలీసులు గుర్తించారు.
రెండు రోజుల క్రితం ఆసుపత్రికని బయటకు వెళ్లిన మహిళ.. ఎంతకు తిరిగి రాకపోవడంతో భర్త పోలీసులను ఆశ్రయించారు. భర్త చెప్పిన వివరాలు, ఘటనాస్థలి వద్ద మృతదేహంతో సరిపోలడంతో హత్యకు గురైంది మంజుల అని నిర్ధారణకు వచ్చారు. సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మంజుల చివరగా ఎవరికి ఫోన్ చేశారన్న వివరాలను సేకరించారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. క్లూస్ టీం సేకరించిన ఆధారాలు కాలి మెట్టలు, తాళాలు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మంజుల అని నిర్ధారించుకున్నారు. రిజ్వానా అనే మహిళ ఈ హత్యకు పాల్పడినట్లు తేలింది. మంజుల రిజ్వానాకు లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చింది.
రెండు నెలల నుండి రిజ్వానా వడ్డీ కట్టలేదు. దీనిపై భర్త ఆమె ఇంటికి వెళ్లి గొడవ చేయడంతో రిజ్వానాకు అవమానంగా భావించి మంజులను చంపేయాలని భావించింది. అయితే ఇంట్లో ఆసుపత్రికి వెళుతున్నానని చెప్పిన మంజుల మరో సారి రిజ్వానాను డబ్బులు అడిగేందుకు శ్రీనివాస ఎన్ క్లేవ్కు వెళ్లింది. వీరిద్దరి మధ్య తగాదా నెలకొంది. ఇదే అదునుగా భావించిన రిజ్వానా పథకం ప్రకారం.. మంజుల మెడకు చున్నీ బిగించి హత్య చేసింది. ఆమెను చంపి ఇంట్లో మంచం కింద శవాన్ని దాచింది. అనంతరం ఎవ్వరూ లేని సమయాన్ని చూసి.. బయటకు తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ వివరాలను శంషాబాద్ పోలీసులు వెల్లడించారు.