అమెరికా (ఇంటర్నేషనల్ డెస్క్)- కరోనా సమయంలో ఎవరు ఏంచేస్తున్నారో అర్ధం కావడం లేదు. ఎవరికి తోచిన చిట్కాలను వాళ్లు ఫాలో అవుతున్నారు. ఇవి తినాలని, అవి తినకూడదని, ఈవిరి పట్టాలని, వేడి నీళ్లు తాగాలని.. ఇలా సోషల్ మీడియాలో ఏది వచ్చినా గుడ్డిగా ఆచరిస్తున్నారు. ఇదిగో ఇలాగే ఆవు పిడకల పొగతో కరోనా పారిపోతుందని ఎవరో చెప్పింది నమ్మి ఏ వ్యక్తి ఏకంగా అమెరికాకే ఆవు పిడకలను తీసుకెళ్లాడు. ఐతే అమెరికాకు ఆవు పిడకలను తీసుకెళ్లడం నిషేదం. దీంతో ఎయిర్ పోర్ట్ లోనే సిబ్బంది ఆ వ్యక్తి నుంచి ఆవు పిడకలను స్వాదీనం చేసుకున్నారు. ఏప్రిల్ 4న జరిగి ఈఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఎయిర్ పోర్ట్ లో ఓ ప్రయాణికుడు వదిలేసిన బ్యాగ్ లో ఆవు పిడకలను గుర్తించారు. భారత్ నుంచి అమెరికాకు వెళ్ళిన భారతీయుడి బ్యాగ్ లో ఈ పిడకలు ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఆవు పిడకల కారణంగా ఫుట్ ఎండ్ మౌత్ సమస్యలు వస్తాయని అమెరికా వైద్య నిపుణులు చెబుతున్నారు. యు ఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ సోమవారం వాటిని ప్రత్యేక ప్రక్రియ ద్వార తీసుకుని నాశనం చేసారు. ఆవు పిడకలు కొన్ని ప్రాంతాల్లో వంటకి ఉపయోగిస్తారని, అనారోగ్య సమస్యలకు కూడా పరిష్కారం చూపిస్తుందని చెబుతున్నారు. ఐతే 1929 నుండి అమెరికా ఆవు పిడకలపై నిషేదం విధించింది.