చత్తీస్ గడ్- భారత రాజ్యంగం ప్రకారం పౌరున్ని కొట్టే అధికారం ఎవ్వరికి లేదు. ఆఖరికి దేశ ప్రధాన మంత్రికి కూడా. ఎవరైనా ఏదైనా నేరం చేస్తే.. అది రుజువైతే కేవలం కోర్టులు మాత్రమే శిక్షలు విధిస్తాయి. పోలీసులు కూడా పౌరులపై చేయి చేసుకోవాడానికి లేదు. అలాంటిది మరి జిల్లా కలెక్టర్ ఎంత భాద్యతాయుతంగా ఉండాలి. జిల్లా మొత్తానికి అధికారి అయిన కలెక్టరే సంయమనం కోల్పోతే ఏమవుతుంది. ఇదిగో చత్తీస్ గఢ్ లో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. సూరజ్పూర్ జిల్లాలో లాక్డౌన్ అమలవుతున్న సమయంలో కలెక్టర్ ఒక యువకునిపై చేయిచేసుకున్నారు. అంతే కాకుండా అక్కడున్న పోలీసులు కూడా ఆ యువకుణ్ణి కొట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలెక్టర్ ఆ యువకునికి క్షమాపణలు చెప్పారు. చత్తీస్ గడ్ ళో లాక్ డౌన్ అమల్లో ఉంది.
ఈ నేపధ్యంలో సూరజ్పూర్ జిల్లా కలెక్టర్ రణబీర్ శర్మ లాక్ డౌన్ ను పరిశీలించేందుకు రోడ్లపైకి వచ్చారు. అక్కడ ఓ యువకుడు కలెక్టర్ కంట పడ్డాడు. ఎందుకు బయటకు వచ్చావని ఆ యువకున్ని కలెక్టర్ ప్రశ్నించడంతో మాస్క్ పెట్టుకున్న ఆ యువకుడు కలెక్టర్కు ఒక కాగితంతో పాటు, మొబైల్ ఫోన్లో ఏదో చూపించబోయాడు. ఆ యువకుడు చెప్పేది ఏదీ పట్టించుకోని కలెక్టర్ అతని ఫోన్ తీసుకొని నేలకేసి కొట్టారు. అంతే కాదు ఆ తరువాత ఆ యువకునిచెంప చెల్లుమనిపించాడు. అక్కడితో వదిలేయకుండా ఆ యువకున్ని కొట్టాలంటూ అక్కడే ఉన్న పోలీసులను ఆదేశించారు కలెక్టర్. ఇంకేముంది జిల్లాకే పెద్దసారు చెప్పాక ఉరుకుంటారా పోలీసులు. వెంటనే వారి చేతిలో ఉన్న లాఠీలతో యువకుడిని చితకబాదారు.
పోలీసులతో లాఠీ దెబ్బలు తింటూనే కలెక్టర్ నేలకేసి కొట్టిన తన ఫోన్ ను తీసుకున్నాడా యువకుడు. ఇప్పుడు ఈ ఘటనకు సంబందించిన వీడియో సోల్ష్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో సూరజ్పూర్ జిల్లా కలెక్టర్ రణబీర్ శర్మపై విమర్శలు వెల్లువెత్తాయి. కనీసం ఆ యువకుడు చెప్పేది వినకుండా కొట్టడం ఏంటని అంతా ప్రశ్నిస్తున్నారు. వెంటనే తేరుకున్న కలెక్టర్ మీడియా ద్వార ఆ యువకునికి క్షమాపణ చెప్పారు. ఆ యువకుడిని అగౌరవపరిచే ఉద్దేశం తనకు లేదని, సూరజ్పూర్ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఆనవసరంగా బయటకు రావడంతో అలా చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. ఇక అమన్ మిట్టల్ అనే ఆ యువకినిపై లాక్డౌన్ను ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు పోలీసులు.