హైదరాబాద్- దేశంలో నేరాలు ఘోరాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. అందులోను మహిళలపై అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతోంది. అమ్మాయిలపై అత్యాచారాలు, హత్యలు పెరగడంతో సమాజంలో ఆందోళన నెలకొంది. ఎప్పుడు ఎక్కడ ఆడవాళ్లపై లైంగిక దాడులు జరుగుతాయోనన్న భయం పెరిగిపోతోంది. అసలు ఆడపిల్లలను బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు వణికిపోతున్నారు.
ఈ క్రమంలో మన హైదరాబాద్ లో దారుణమైన ఘటనలు జరుగుతున్నాయి. పనిచేసే ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోయింది. అందులోను పబ్ లు, రిస్టారెంట్లలో పనిచేసే అమ్మాయిల పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఇటీవల హైదరాబాద్ నగరంలోని పబ్లు తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. డ్రగ్స్ కేసులతో పాటు యువతిపై దాడి చేసిన ఘటనలు గతంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
తాజాగా హైదరాబాద్ లో మరో దారుణమైన ఘటన వెలుగుచూసింది. నగరంలోని ఓ పబ్లో పనిచేస్తున్న యువతిపై లైంగిక దాడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. హైదరబాద్ లోని జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్న కెమిస్ట్రీ పబ్ లో పనిచేసే ఓ యువతిపై లైంగిక దాడిజరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అదే పబ్ లో పనిచేస్తున్న కుక్ అత్యాచారం చేసినట్లు జూబ్లీహిల్స్ యువతి పోలీసులకు పిర్యాదు చేసింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు పరారిలో ఉండటంతో వాడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సదరు పబ్ యాజమాన్యంపై కూడా పోలీసులు కేసు నోదు చేసినట్లు తెలుస్తోంది. వైద్య పరీక్షల కోసం యువతిని ఆస్పత్రికి తరలించారు. ఈ కేసును సైబరాబాద్ పోలీసులు సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం.