అమరావతి- తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో వైసీపీ నేతల అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ఆరోపించారు. వైసీపీ అక్రమాలకు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన టీడీపీ శ్రేణులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ అక్రమాలపై ఎదురొడ్డి పోరాడిన టీడీపీ కార్యకర్తలను, నాయకులను చంద్రబాబు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. తిరుపతి లోక్ సభ స్థానానికి జరిగిన ఎన్నికలో ఓటింగ్ శాతం తగ్గడం వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు అద్దం పడుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
అరాచకాలు, అక్రమాలతో ప్రజాస్వామ్యాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్న వైసీపీ చర్యలకు వ్యతిరేకంగా పోరాడిన టీడీపీ కార్యకర్తల తెగువ స్ఫూర్తిదాయకమని మెచ్చుకున్నారు.అప్రజాస్వామికంగా, అనైతిక కార్యకలపాలతో ఐదు లక్షలకు పైగా మెజార్టీ వస్తుందని అహంభావంతో వ్యవహరించిన వైసీపీ శ్రేణులకు ఓటుతో బుద్ధి చెప్పిన తిరుపతి లోక్ సభ ఓటర్లకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. తిరుపతి ఫలితం ఏదైనా నైతిక విజయం తెలుగుదేశం పార్టీదేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తిరుపతి ఎన్నికలో టీడీపీ పార్టీ కోసం పనిచేసిన వారందరికి చంద్రబాబు కృతజ్ఞతలు చెప్పారు.