న్యూ ఢిల్లీ- కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు శుక్రవారం కేంద్ర మంత్రి మండలితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర రూపం అనంతరం ప్రధాని కేంద్ర మంత్రులతో సమావేశం కావడం ఇదే తొలిసారి. అయితే ఈ సమావేశం నేరుగా కాకుండా వర్చువల్ విధానం ద్వారా జరిగినట్లు ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. మే 1 నుంచి దేశవ్యాప్తంగా మెగా వ్యాక్సీనేషన్ డ్రైవ్ చేపట్టబోతున్నట్లు కొద్ది రోజుల క్రితమే ప్రధాని మోదీ ప్రకటించారు. ఈరోజు క్యాబినెట్ సమావేశంలో ప్రధానంగా ఆ విషయంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దానితో పాటు దేశంలో కోవిడ్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రాష్ట్రాలతో కలిసి పని చేసే అంశంపై చర్చించినట్లు సమాచారం. గడిచిన 14 నెలల్లో కోవిడ్పై ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఈ సమావేశంలో చర్చించినట్లు అధికారులు తెలిపారు.
ఇక దేశంలో ఆక్సీజన్ కొరత, కోవిడ్ ఆసుపత్రుల్లో బెడ్ల కొరత గురించి ప్రస్తావన వచ్చిందని తెలుస్తోంది. కరోనాను ఎదుర్కోవడంలో ఉన్న అడ్డంకులకు సత్వరమే పరిష్కారం చూపించి, దేశ ప్రజలను మహమ్మారి బారి నుంచి కాపాడడానికి ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. కోవిడ్ విషయమై దేశంలోని పలు రాష్ట్రాల ముఖ్యంత్రులతో ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చర్చించారు. అంతే కాకుండా ఫార్మా సంస్థల అధినేతలు, ఆక్సీజన్ సప్లైయర్లు, ఆర్మీ దళాలు, ఇతర అధికారులతో ప్రధాని పలుమార్లు చర్చించి తగిన ఆదేశాలు జారీ చేశారు.