ఓ సాధరణ మధ్య తరగతి ఇంటికి కరెంట్ బిల్ ఎంత వస్తుంది? మహా అయితే ఒక రూ.500. అదే.., కూలి పని చేసుకునే ఓ నిరుపేద ఇంటికి ఎంత వస్తుంది? మహా అయితే రూ.300. కానీ.. రెండు గదుల ఇల్లు ఉన్న ఓ నిరుపేద ఇంటికి ఏకంగా రూ.1,48,371 కరెంట్ బిల్ వస్తే! ప్రస్తుతం ఏపీలో ఇదే జరిగింది. దీంతో.. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
అనంతపురం జిల్లాలోని ఉరవకొండ మండలం పాల్తూరు గ్రామంలో పర్వతప్ప అనే కూలి నివశిస్తున్నాడు. ఇతనిది రెండు గదులు ఉండే ఓ చిన్న ఇల్లు. మూడు బల్బులు, ఒక ఫ్యాన్, ఒక టీవీ.. పర్వతప్ప ఇంట్లో ఉండే ఎలక్ట్రికల్ వస్తువులు ఇవే. ఇవి కూడా రాత్రి పూట మాత్రమే వాడతాడు పర్వతప్ప. ఉదయం అంతా కూలి పనికి వెళ్లి ఎక్కడో బయట ఉంటాడు. ఇందువల్లే పర్వతప్పకి ప్రతినెలా రూ.200 మాత్రమే కరెంట్ బిల్ వస్తోంది. ఇక ఈసారి కూడా టైమ్ కి బిల్ వచ్చింది. కానీ.., మొత్తం బిల్ ఎంతో తెలుసా? అక్షరాలా రూ.1,48,371.
ఆ బిల్ చూసి పర్వతప్పకి గుండె ఆగినంత పని అయ్యింది. వెంటనే విద్యుత్ శాఖ అధికారులను కలుసుకున్నాడు ఆ బక్క కూలి. అధికారులు మాత్రం షరా మాములుగా.. అవన్నీ మాకు తెలియవు. బిల్ వచ్చింది కాబట్టి.. మొత్తం డబ్బు కట్టాల్సిందే అని తేల్చేశారు. దీంతో.., పర్వతప్ప కుప్పకూలిపోయాడు. కూలి పనులు చేసుకునే తాను అంత బిల్ ఎలా కట్టాలి అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. అయితే.., మీటర్ లో తప్పు జరగడం వల్లే అంత బిల్ వచ్చినట్టు తెలుస్తోంది. కానీ.., అధికారులు మాత్రం ఎవరూ మీటర్ చెక్ చేయకుండానే ఇలా పర్వతప్పని బిల్ కట్టమని డిమాండ్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి.., ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.