ఆయుర్వేద మూలికలతో ఆనందయ్య తయారుచేసిన కరోనా మందు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్టాపిక్గా మారింది. దీంతో అనేక రాష్ట్రాల నుంచి వేలాది మంది ప్రజలు కృష్ణపట్నానికి తరలివచ్చారు. ఆనందయ్య కరోనా పొజిటివ్ వచ్చే రోగులకు, మరికొన్ని కరోనా వ్యాధి సోకకుండా ఉండేందుకు ప్రజలకు ఉచితంగా అందిస్తున్నారు. వెంకటయ్య స్వామి శిష్యుడు గురవయ్య స్వామి దగ్గర శిష్యరికం కూడా చేశాడు. ఆయుర్వేదంలో తనకున్న అనుభవంతో కరోనాకు ఔషధాన్ని తయారు చేసి పంపిణీ చేస్తున్న ఆనందయ్యను చట్టసభలకు పంపి గౌరవించాలన్న ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గవర్నర్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా సీఎస్ ఆదిత్యానాధ్ దాస్ కు లేఖరాయడం సంచలనంగా మారింది. ఆనందయ్యకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. ఆనందయ్యకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించాలని వెన్నెల ఫౌండేషన్ వైస్చైర్మన్, హైకోర్టు న్యాయవాది సుంకర నరేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆయుర్వేద మందు తయారు చేసి ప్రజలకు ఎంతో మేలు చేకూర్చిన ఆనందయ్య లాంటి వ్యక్తిని చట్టసభలకు నామినేట్ చేస్తే ఎంతో గౌరవంగా ఉంటుందని, ఈ విషయమై ఏపీ ప్రభుత్వానికి తగు సూచనలు చేయాలని సుంకర నరేష్ గవర్నర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(3)(E), 171(5) ప్రకారం ఆనందయ్య ఎమ్మెల్సీగా నియమించే అవకాశాన్ని పరిశీలించాలంటూ ప్రభుత్వానికి సూచించారు. ఆనందయ్య లాంటి వ్యక్తి ఎమ్మెల్సీగా నియమితులైతే ఎంతో మేలు చేకూరుతుందని ఆయన అన్నారు.