రాజన్న సిరిసిల్ల- మనిషికి ఎప్పుడు ఏ ఆపద ముంచుకొస్తుందో చెప్పలేం. అప్పటి వరకు బాగానే ఉన్నవాళ్లు హఠాత్తుగా మనల్ని విడిచి వెళ్లిపోతారు. ఇదిగో సిరిసిల్ల జిల్లాలో ఇలాంటి హఠాత్పరిణామమే జరిగింది. అసలే కల్లు గీతా కార్మికులు అత్యంత ప్రమాదమైన వృత్తిలో ఉంటారు. ఆకాశాన్ని తాకుతున్నట్లు ఉండే తాటి చెట్లు ఎక్కి కల్లు తీస్టుంటారు గీత కార్మికులు. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రాణాలు గాల్లో కలవాల్సిందే.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ కల్లు గీత కార్మికుడు రోజు మాదిరిగానే కులవృత్తిలో నిమగ్నమయ్యాడు. చెట్టుపైకెక్కి కల్లు గీసే పనిలో ఉన్నాడు. ఇంతలోనే అనుకోని మృత్యువు ముంచుకొచ్చింది. గుండెపోటు రూపంలో ఆ గీత కార్మికుడి ప్రాణాలు బలి తీసుకుని తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. చెట్టుపైనే ప్రాణాలు కోల్పోయిన గౌడన్న విగతజీవిగా వేలాడుతుండడం చూపరులను తీవ్రంగా కలచివేసింది.
తంగళ్లపల్లి మండలంలోని బద్దెనపల్లి గ్రామానికి చెందిన గుగ్గిళ్ల కిష్టయ్య గీత కార్మికుడు. ఎప్పటిలాగే బుధవారం సాయంత్రం కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కాడు. కల్లు గీస్తున్న కిష్టయ్యకి చెట్టుపై ఉండగానే గుండెపోటు వచ్చింది. చెట్టుపైనే గుండెనొప్పితో విలవిలలాడుతూ అక్కడే ప్రాణాలు వదిలాడు. గుండెపోటుతో మృతి చెందిన కిష్టయ్య మృతదేహం చెట్టుపై తలకిందులుగా వేలాడుతుండడం స్థానికులను కలచివేసింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కిందకు దించారు. మృతుడు కిష్ణయ్యకు నలుగురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. ఆయన మరణంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది. ఇంటి పెద్ద కిష్ణయ్యను కోల్పోయిన కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వానికి విన్నవించారు.