వాళ్లిద్దరూ అక్కా తమ్ముడు. పండగ పూట తోటి స్నేహితులు కొత్త బట్టలు తెచ్చుకుని ముఖం నిండా చిరునవ్వుతో సంతోషంతో మురిసిపోతుంటే.., ఈ అక్కా తమ్ముడు మాత్రం.. తల్లిదండ్రలు లేని అనాథలై గుండెల నిండా మోయలేని భారాన్ని మోస్తూ రాత్రి, పగలు కన్నీళ్లతో సహవాసం చేస్తూ అపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. అసలేం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం దండ్రపల్లి. ఇదే గ్రామంలో ఎడెల్లి మల్లేశం, సత్యా దంపతులు.
వీరికి చాలా ఏళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఈ దంపతులకు సంగీతా, అవినాశ్ అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. పుట్టిన పిల్లలతో మల్లేశం, సత్యా దంపతులు సంతోషంగా జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే తండ్రి మల్లేశం గతేడాది కరోనాతో మరణించాడు. ఇక భర్త మరణించడంతో సత్యా తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. అలా కొన్ని రోజులు గడిచిందో లేదో గత ఐదు రోజుల కిందట తల్లి సత్యా గుండె పోటుతో ఆస్పత్రిలో చేరింది. ఇక చికిత్స పొందుతూ చివరికి సత్యా సైతం ప్రాణాలు విడిచింది.
ఇన్నాళ్లు తోడుగా నిలిచిన తల్లి కూడా మరణించడంతో ఆ పిల్లలు తల్లిదండ్రులు లేని అనాథలమయ్యామని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎవరూ లేని అనాథలైన ఈ పిల్లలను చూసి స్థానికుల కంట కన్నీరు ఆగడం లేదు. అయితే ప్రస్తుతం అవినాశ్ ఇంటర్ ఒకేషనల్ కోర్సు చేస్తుండగా, అక్కా సంగీతా డిగ్రీలో బీకాం చదువుతోంది. ఇంత చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో ఆ పిల్లలు అపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ విషాద ఘటనతో స్థానికుల కంట కన్నీరు ఆగడం లేదు.