నల్గొండ క్రైం- సమాజంలో నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు, దొంగతనాలు, దోపిడీలే. ఉదయం లేస్తే ఏ విషాదకరమైన వార్త వినాల్సి వస్తుందోనని అంతా ఆందోళనలో బతుకుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా, నేరాలు మాత్రం అదుపులోకి రావజం లేదు.
అందులోను ఈ మధ్యకాలంలో అమ్మాయిల అదృశ్యం కలకలం రేపుతోంది. తెలంగాణలో యువతులు, మహిళలు కనిపించకుండా పోతున్నారని చాలా కేసులు నమోదు అవుతున్నాయి. దీన్ని సీరియస్ గా తీసుకున్న తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి సమయంలో రాష్ట్రంలో మరో యువతి మిస్ అయ్యింది. ఈ ఘటన నల్గొండ జిల్లా చౌటుప్పల్ లో చోటుచేసుకుంది.
సంస్థాన్ నారాయణపురం తండాకు చెందిన 23 ఏళ్ల యువతి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఇటీవల చౌటుప్పల్ లో హనుమాన్ నగర్ లో ఉంటున్న అక్క ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో ఈనెల 5వ తేదీన కిరాణం దుకాణానికి వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయటికి వెళ్లిన యువతి ఇంతవరకు ఇంటికి తిరిగిరాలేదు. చుట్టు పక్కల ఎంత వెతికినా ఆమె ఆచూకి మాత్రం దొరకలేదు.
దీంతో ఆ యువతి తండ్రి బన్సీలాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. యువతికి ఏదైనా ప్రేమ వ్యవహారం ఉందా అన్న వివరాలను సేకరిస్తున్నారు. మరోవైపు ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్న కోణంలోను పోలీసులు విచారణ జరుపుతున్నారు. మొత్తానికి యువతి అదృశ్యం స్థానికంగా కలకలం రేపుతోంది.