స్టార్ హీరో రాంచరణ్ సతీమణి, అపోలో ఫౌండేషన్ వైస్ చైర్ పర్సన్ కొణిదెల ఉపాసనకు అరుదైన గౌరవం దక్కింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రభుత్వం ఉపాసనకు గోల్డెన్ వీసా ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా ఉపాసన సోషల్ మీడియా వేదికగా.. ‘ఈ క్రిస్మస్ సందర్భంగా ఓ అరుదైన కానుక అందుకున్నాను’ అంటూ బయట పెట్టింది.
అలాగే ఇటీవల జరిగిన ఇండియా ఎక్స్ పో-2020 ద్వారా ఈ ప్రపంచమంతా(వసుధైక కుటుంబం) ఒక్కటే అని తెలుసుకున్నాను. ఈ క్రమంలో యూఏఈ ప్రభుత్వం నుంచి గోల్డెన్ వీసా అందుకోవడం సంతోషంగా ఉందని ఉపాసన తెలిపింది. మనసా వాచా భారతీయురాలినే.. కానీ అన్ని దేశాల పట్ల ఎనలేని గౌరవం ఉంది. ఈ గోల్డెన్ వీసా రాకతో అధికారికంగా ప్రపంచ పౌరురాలిగా మారానని ఆమె వెల్లడించింది. సామాన్యంగా UAE లో ఉద్యోగం, వ్యాపారం, విద్య గురించి వెళ్లే విదేశీయులకు అక్కడ ఎవరైనా స్పాన్సర్ చేయాల్సి ఉంటుంది. గోల్డెన్ వీసా ఉంటే నేషనల్ స్పాన్సర్ లేకుండా UAE లో తమ కార్యకలాపాలు చేసుకోవచ్చు. ఈ వీసా ఉంటే 100 శాతం యూఏఈ పౌరుడిగానే భావిస్తారు.
This Christmas I received A gift that reiterates what I was taught at the @IndiaExpo2020
“Vasudhaiva Kutumbakam”-the world is one family
Happy to get my UAE #GoldenVisa
Heart & soul is Indian with immense respect for all nations
I’m officially a global citizen!@UAEmediaoffice pic.twitter.com/JQSx9SFG9U— Upasana Konidela (@upasanakonidela) December 27, 2021
గోల్డెన్ వీసా అనేది లాంగ్ టర్మ్ వీసా. ఐదేళ్లు, పదేళ్ల ప్రాతిపదికన జారీచేసే ఈ వీసాలు ఆటోమేటిగ్గా రెన్యువల్ అవుతుంటాయి. 2019 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది. ఇప్పటివరకు ఎంతోమంది ఇండియన్స్ UAE గోల్డెన్ వీసాలు అందుకున్నారు. టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా, మలయాళ నటులు మమ్ముట్టి, మోహన్ లాల్, దుల్కర్ సల్మాన్, నటి త్రిష, గాయని చిత్రలతో పాటు పలువురికి ఈ వీసా దక్కింది. ఈ గోల్డెన్ వీసా అందుకున్న వారిలో నిర్మాత బోనీ కపూర్ ఫ్యామిలీ కూడా ఉంది. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి మొదటిగా కొణిదెల ఉపాసన అందుకోవడం విశేషం. మరి మెగా కోడలికి దక్కిన అరుదైన గౌరవం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి.