Tollywood: టాలీవుడ్ లో సమ్మె సైరన్ మోగింది. సినిమా నిర్మాణ వ్యయం పెరిగిపోయింది, కలెక్షన్స్ రావడం లేదు, ప్రేక్షకులు ఓటీటీలకు పరిమితం అయిపోయి థియేటర్లకు రావడం లేదు.. కాబట్టి కొన్నిరోజులు సినిమా షూటింగ్స్ బంద్ చేస్తున్నాము అన్నది నిర్మాతల వాదన. నిజానికి నిర్మాతల కష్టాన్ని తక్కువ చేసి చూడలేము. కరోనా కాలం నుండి వీరికి గడ్డుకాలం ఎదురవుతూనే ఉంది. నిర్మాత బాగుంటేనే పరిశ్రమ కూడా బాగుంటుంది. సో.. నిర్మాతలు చెప్తున్న ఈ సమస్యల మీద చర్చ జరగాల్సిందే.
ఇక్కడ అందరికి అర్థంకాని ప్రశ్న ఒక్కటే..! ప్రేక్షకులు థియేటర్లకు ఎందుకు రావడం లేదు? తప్పు ప్రేక్షకులదా? అసలు ఈ సమస్యకు కాస్త లోతులకు వెళ్లి సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. ఓటీటీలకు అలవాటు పడటం వల్లే ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు అన్నది కొంతమంది నిర్మాతల వాదన. మరి.. ట్రిపుల్ ఆర్, కెజీఎఫ్, విక్రమ్ లాంటి సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యింది ఓటీటీల కాలంలోనే కదా? సో.. ఓటీటీలు అన్నవి ఇక్కడ సమస్యే కాదు. కంటెంట్ బాగుంటే.. ఎవ్వరు వద్దన్నా ప్రేక్షకుడు ధియేటర్ కి వస్తాడు.
మరి.. అప్పట్లో ఓ మోస్తరు సినిమాకి కూడా ఫ్యామిలీతో సహా వచ్చి చూసేవారు కదా అంటే.. ఇక్కడే అసలు సమస్య ఉంది. కరోనా తర్వాత అన్నీ పరిస్థితులు మారిపోయాయి. ఖర్చులు పెరిగిపోయాయి. ఇలాంటి సమయంలో ఫ్యామిలీతో ధియేటర్ కి వచ్చే సాహసం మధ్యతరగతి మనిషి చేయలేకపోతున్నాడు. అసలు మన నిర్మాతలు థియేటర్ లో ధరలను ఎప్పుడైనా పరిశీలించారా? థియేటర్ కి వెళ్లి ఒక వాటర్ బాటిల్ కొనాలంటే రూ. 60, చిప్స్ ప్యాకెట్ రూ. 40, పాప్ కార్న్ కొనాలంటే రూ. 200 – 350, కూల్ డ్రింక్స్ కి రూ. 90.. ఈ విధంగా ప్రేక్షకులను సర్వం దోచుకుంటుంటే థియేటర్లకు ఎలా వస్తారు?
ఇవన్నీ సరిపోనట్టు ఇప్పుడు టికెట్ రేట్లు కూడా ఇష్టా రీతిన పెంచేశారు. ఈ లెక్కన ఓ సామాన్యుడు ఫ్యామిలీతో ధియేటర్ కు వస్తే రూ.2000 వరకు ఖర్చు అవుతుంది. ఇక్కడ సాధరణ ప్రేక్షకుడు థియేటర్ కు దూరం అవుతున్నాడు. కష్టం వచ్చినా, ఆనందం వచ్చినా ఒకప్పుడు థియేటర్ల వద్ద క్యూ కట్టిన వాళ్లంతా.. ఇప్పుడు ఈ దోపిడీ కారణంగా పార్కులు, టెంపుల్స్, షాపింగ్ మాల్స్ కు వెళ్లి చిల్ అవుతున్నారు.
ప్రేక్షకుడు ఇంటి నుండి తెచ్చుకునే చిరుతిండి, చిప్స్, వాటర్ బాటిల్స్.. ఆఖరికి చిన్న పిల్లల పాలడబ్బాలు లోపలికి రానివ్వని పరిస్థితి నెలకొంది ఈ వ్యవస్థలో. అయినా సరే.. ఇన్నాళ్లు వీటిని భరిస్తూ ప్రేక్షకులు సినిమాకి అగ్రపీఠం ఇస్తూ వచ్చారు. కరోనా సమయంలో ప్రపంచంలో ఎక్కడా ప్రేక్షకులు థియేటర్లకు రాకపోయినా.. మన తెలుగు ప్రేక్షకులు మాత్రం సినిమాలను థియేటర్లకు వెళ్లి ఆదరించారు. సినిమా అంటే మన వాళ్ళకి అంతటి ఇష్టం.
అలాంటిది.. ఈ అడ్డు, అదుపు లేని ధరలకు భయపడే సామాన్యుడు థియేటర్లకు దూరం అవుతున్నాడు. నిర్మాతల కష్టాలు తగ్గాలన్నా, మళ్లీ థియేటర్లకు కళ రావాలన్నా ఈ పరిస్థితిలో మార్పులు రావాలి. సినిమా పెద్దలు ప్రేక్షకుల డబ్బును కూడా డబ్బుగానే చూడాలి. థియేటర్లలో ఈ దోపిడీ ఆగితే గాని.. ఈ సమస్యలు అన్నింటికీ ఓ పరిష్కారం దొరకదనే అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. మరి.. సినీ పెద్దలు ఈ విషయంలో ఏమైనా ఆలోచన చేస్తారేమో చూడాలి. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.