ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట.. ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కెటగిరీలో నామినేట్ అయ్యింది. దీనిపై తెలుగు ప్రేక్షకులతో పాటు భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం రాజమౌళి తీరును తప్పు పడుతున్నారు. తాజాగా సీనియర్ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇలానే కామెంట్స్ చేశారు. ఆ వివరాలు..
జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ సినిమా సాధిస్తోన్న రికార్డులు అన్నీ ఇన్నీ కాదు. కలెక్షన్లు, అంతర్జాతీయ అవార్డుల సంగతి పక్కన పెడితే.. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్కు నామినేట్ కావడం అన్నింటికన్నా అరుదైన గౌరవం. మరో నాలుగు రోజుల్లో అనగా మార్చి 13న ఆస్కార్ అవార్డులను ప్రకటిస్తారు. ఇక నాటు నాటు పాట గనక అవార్డు గెలిస్తే.. రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ల పేర్లు ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అయితే ఆర్ఆర్ఆర్ ఆస్కార్కు నామినేట్ అవ్వడం పట్ల మెజారిటీ జనాలు సంతోషం వ్యక్తం చేస్తుండగా కొందరు మాత్రం.. రాజమౌళి ఆస్కార్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నాడని విమర్శిస్తున్నారు. ఇక తాజాగా సీనియర్ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా ఇలానే కామెంట్స్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. దీనిపై నెటిజనులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు..
కొన్ని రోజుల క్రితం రవీంద్ర భారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు నేటి కాలంలో సినిమా మేకింగ్ అనేది ఎలా మారిందనే ప్రశ్న ఎదురయ్యింది. దీనికి తమ్మారెడ్డి సమాధానం చెబుతూ.. ఆర్ఆర్ఆర్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆస్కార్ ప్రమోషన్స్ కోసం ఆర్ఆర్ఆర్ బృందం ఏకంగా 80 కోట్లు ఖర్చు చేశారు. అదే 80 కోట్లు మాకు ఇస్తే ఓ 8 సినిమాలు తీసి వాళ్ళ మొఖాన కొడతాం’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే తమ్మారెడ్డిపై కొందరు మండి పడుతున్నారు. మీకు అసలు ఆస్కార్ అవార్డ్ నామినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసా.. ఊరికే నోటికి వచ్చింది మాట్లాడితే సరి కాదు.. అన్ని తెలుసుకుని మాట్లాడాలి అంటున్నారు.
ఒక తెలుగు సినిమాలోని పాట ఆస్కార్కు నామినేట్ అవ్వడం అంటే మామెలు విషయం కాదు. కానీ ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆ ఘనత సాధించింది. అయతే ఆ క్రెడిట్ మొత్తం జక్కన్నది అని చెప్పవచ్చు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు అందుకోవాలి అంటే టాలెంట్తో పాటు ప్రెజంటేషన్ కూడా ఉండటం ఎంతో ముఖ్యం. కేవలం ప్రతిభ ఉంటే సరిపోదనే విషయం చాలా మందికి తెలియదు. వాస్తవానికి ఒక సినిమాకి ఆస్కార్ అవార్డు రావాలి అంటే అన్నింటి కన్నా ముందుగా వాళ్ల దేశం నుంచి పూర్తి స్థాయిలో మద్దతు ఉండాలి. అయితే ఆర్ఆర్ఆర్ విషయంలో ఇలా జరగలేదు. ఈ సినిమా ఇండియా నుంచి అధికారక ఎంట్రీ కాదు. అందుకే ఓపెన్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ ఆస్కార్కి నామినేట్ అయ్యిందంటే అది మామూలు విషయం కాదు.
ఒక సినిమా ఆస్కార్ బరిలోకి వెళ్లాలి అంటే ముందు ప్రపంచ దేశాలకు ఆ సినిమా గురించి తెలియాలి. అంతర్జాతీయ వేదికల మీద సినిమా గురించి చర్చలు జరగాలి. ఒక రకంగా చెప్పాలంటే.. ఈ సినిమా గురించి విదేశాల్లో పెద్ద ఎత్తున చర్చ జరగాలి. ఫలనా సినిమా ఉంది.. చాలా బాగుంది.. ప్రేక్షకులు తప్పకుండా చూడాలి అనే భావన రావాలి. ఇక ఆర్ఆర్ఆర్ విషయంలో రాజమౌళి ఫాలో అయ్యింది దీన్నే. ట్రిపులార్ సినిమాని ప్రపంచానికి పరిచయం చేశారు. దేశ దేశాలు తిరుగుతూ, హీరోలను తిప్పుతూ ఇది మా సినిమా, వీళ్లు మా స్టార్లు అంటూ ట్రిపుల్ ఆర్ మూవీని, దానిలోని నటీనటులను ప్రపంచానికి పరిచయం చేశాడు జక్కన్న. నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడం వెనుక కూడా ఈ వ్యూహమే దాగుంది.
ఇక ట్రిపుల్ ఆర్ సినిమా మేకింగ్ విషయానికి వస్తే.. దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. అల్లూరి పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్చరణ్, కొమురం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించారు అనడం కన్నా జీవించారు అనడం ఉత్తమం. స్వాతంత్య్రం కోసం అల్లూరి, భీమ్ కలిసి పోరాడితే ఎలా ఉంటుందనే కథాంశంతో ఫిక్షనల్ పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమాను తెరెక్కించారు జక్కన్న. వాస్తవంగా చెప్పాలంటే.. ఇండియన్ గవర్నమెంట్ RRR ను ఆస్కార్కు పంపలేదు. దీంతో రాజమౌళి స్వయంగా రంగంలోకి దిగి భారీ మొత్తాన్ని ఖర్చు పెట్టి అమెరికన్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఆస్కార్ నామినేషన్స్కు పంపారు.
తర్వాత RRR కు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్స్ సహా పలు అంతర్జాతీయ అవార్డులెన్నో వచ్చాయి. ఈ సినిమా నుంచి నాటు నాటు సాంగ్.. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్కు నామినేట్ అయ్యింది. జక్కన్న ఇంత కష్టపడ్డాడు, ఖర్చు చేశాడు కనుకే ఆర్ఆర్ఆర్లోని నాటు నాటు పాట ఆస్కార్కి నామినేట్ అయ్యింది. తెర వెనక ఉన్న కష్టాన్ని గురించకుండా ఊరికే కామెంట్స్ చేయడం మంచిది కాదు అంటున్నారు నెటిజనులు. మరి తమ్మారెడ్డి వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.