స్టార్ హీరో శర్వానంద్కు యాక్సిడెంట్ అయిందన్న వార్త సంచలనంగా మారింది. దీంతో తమ అభిమాన హీరో ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ టైమ్లో శర్వా కారు ప్రమాదంపై ఆయన టీమ్ క్లారిటీ ఇచ్చింది.
టాలీవుడ్ స్టార్ హీరో శర్వానంద్ ప్రయాణిస్తున్న కారు ఆదివారం ప్రమాదానికి గురైంది. ఆయన కారు ఇవాళ తెల్లవారుజామున ఫిల్మ్ నగర్ జంక్షన్ వద్ద అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో శర్వానంద్ కారు బోల్తా పడిందని, ఆయనకు తీవ్ర గాయాలయ్యాయంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఆయన ఆరోగ్యంపై అభిమానులు అందోళన చెందుతున్నారు. తాజాగా ఈ ప్రమాదంపై శర్వానంద్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఇది చిన్న ఘటనేనని, ఎవరికీ ఎలాంటి గాయాలవ్వలేదని హీరో ప్రతినిధులు తెలిపారు. యాక్సిడెంట్ జరిగిన సమయంలో కారులో ఉన్న వారందరూ క్షేమంగా ఉన్నారని స్పష్టం చేసింది. శర్వా కారుకు పెద్ద ప్రమాదం జరిగిందని వస్తున్న న్యూస్లో నిజం లేదని ఆయన టీమ్ పేర్కొంది. ఈ ఘటనలో కారుకు చిన్న గీత పడిందని, ఘటన జరిగిన టైమ్లో డ్రైవర్ అక్కడే ఉన్నారని తెలిపింది.
శర్వానంద్ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. డ్రైవర్కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. డ్రైవర్ ఆల్కహాల్ తాగలేదని పరీక్షల్లో తేలింది. యాక్సిడెంట్ జరిగిన టైమ్లో శర్వానంద్ కారులోనే ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఇక, శర్వా ప్రస్తుతం తన పెళ్లి పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. రక్షితతో కలసి త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారీ హీరో. జూన్ 2, 3 తేదీల్లో రాజస్థాన్ రాష్ట్రం, జైపూర్ ప్యాలస్లోని లీలా ప్యాలస్లో శర్వా పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. టాలీవుడ్లో తనకు సన్నిహితులైన వారికి ఆయన ఆహ్వానాలు అందజేశారని తెలిసింది. శర్వా మ్యారేజ్కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులతో పాటు యూవీ క్రియేషన్స్ అధినేతల్లో ఒకరైన విక్రమ్.. ఇంకా మరికొందరు హాజరు కానున్నట్లు సమాచారం.
Clarification from Team #Sharwanand pic.twitter.com/mrvAmqwnMX
— Fukkard (@Fukkard) May 28, 2023