భారతదేశం.. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తోంది. ఏ దేశంలో అయినా మనకు ఏక దేవతారాధన కనిపిస్తుంది. కానీ మన భారతీయ సమాజంలో మాత్రం బహు దేవతారాధనతో పాటు ప్రకృతిని కూడా ఆరాధించే సంస్కృతి ఉంది. రాళ్లు, వృక్షాలకు కూడా పూజలు చేసి.. భక్తిగా ఆరాధిస్తాం.. ఆర్తిగా కొలుస్తాం. దైవ దర్శనం కోసం ఎంత దూరమైనా వెళ్తాం.. ఎన్ని అడ్డంకులను అయినా దాటుతాం. అమర్నాథ్ యాత్ర ఈ కోవకు చెందినదే. మంచు కొండల్లో.. సరిగా ఊపిరి కూడా ఆడని పరిస్థితులను సైతం లెక్కచేయకుండా.. శివయ్య దర్శనం కోసం సాహస యాత్ర చేస్తాం. అలాంటి యాత్రే సలేశ్వరం యాత్ర. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా ప్రసిద్ధి పొందిన ఈ యాత్రకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక.. పక్క రాష్ట్రాల ప్రజలు కూడా తండోపతండాలుగా తరలి వస్తారు. రెండేళ్లకోసారి జరిగే సలేశ్వరం యాత్ర శుక్రవారం ప్రారంభం అయ్యింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు..
ఇది కూడా చదవండి: వీడియో: చిన్నారికి ఫిదా అయిన ప్రధాని మోదీ!
ఈ యాత్రలో.. ఎక్కడో లోయలో వెలసిన ఆ శివయ్య దర్శనం చేసుకోవాలంటే.. రాళ్లు-రప్పలు, వాగులు-వంకలు దాటుతూ.. కష్టమైన మార్గాల్లో నడకదారిన ప్రయాణం చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇవేవి భక్తులను ఆపలేవు. ఎందుకంటే దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం.. అడుగడుగునా గుట్టలు, కొండలు.. వాటిని దాటుకుంటూ కాలి నడకన వెళ్తుంటే.. ఆహ్లాదకరమైన వాతావరణం.. చెవులను సన్నగా మీటే పక్షుల కిలకిలరావాలు, గుట్టల పైనుంచి జాలువారే నీటి చప్పుడు.. అచ్చం అమర్నాథ్ యాత్రకు వెళ్లిన అనుభూతి కలుగుతుంది. యాంత్రిక జీవితాలకు అలవాటు పడ్డ మనలో ఈ యాత్ర.. కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. సలేశ్వరుడిని చేరకునే దారి.. మన జీవిత ప్రయాణాన్ని సూచిస్తుంది. అందుకే భక్తులు ఈ కష్టాలకు భయపడకుండా.. యాత్రలో పొందే అందమైన అనుభూతుల కోసం సలేశ్వరం యాత్ర చేస్తారు.
ఉగాది తర్వాత ఉత్సవాలు..తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండలం అప్పాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో నల్లమల అడవుల్లో సలేశ్వరడు వెలిశాడు. ఈ ఆలయాన్ని ఏడాది అంతా మూసే ఉంచుతారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ జాతర జరుగుతుంది. ఈ జాతర ఉగాది వెళ్ళిన తరువాత తొలి పౌర్ణమికి మొదలవుతుంది. 3 నుంచి 5 రోజులు మాత్రమే ఈ ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తారు. గత రెండేళ్లుగా కోవిడ్ నిబంధనల కారణంగా సలేశ్వరం జాతర వాయిదా పడింది. ఈ ఏడాది కరోనా ఉధృతి తగ్గడంతో శుక్రవారం నుంచి జాతర ప్రారంభమయ్యింది. అయితే ఈ ఏడాది మూడు రోజులే ఉత్సవాలు జరగనున్నాయి.
చారిత్రక ఆధారాలు..
ఈ సలేశ్వరం ఆలయం అత్యంత పురాతనమైన ప్రసిద్ధ దేవాలయం. ఈ సలేశ్వరం దేవాలయం 6 లేదా 7 వ శతాబ్దం నాటిది. ఇక్ష్వాకుల శాసనాల్లో సలేశ్వరం ప్రస్తావన ఉందని కొందరు చరిత్రకారులు చెబుతారు. నాగార్జున కొండల్లో పురావస్తు శాఖ తవ్వకాల్లో దొరికిన క్రీ.శ. 260 నాటి ఇక్ష్వాకుల శాసనాలలో చుళధమ్మగిరి గురించిన ప్రస్తావన ఉన్నది అని.. ఆ ప్రకారం.. చుళధమ్మగిరి పదాన్ని విశదికరిస్తే- చుళ… సుళ… తెలుగు వ్యవహారంలో “సుల” గా రూపొంది.. బౌద్ద క్షేత్రం శైవ క్షేత్రంగా మార్పు చెందుతూ సులేస్వరంగా.. చివరగా సలేశ్వరంగా మారి వుంటుంది అనే అభిప్రాయం ఉంది. కానీ దీని గురించి సరైన శాస్త్రీయ ఆధారాలు లేవు.
ఇది కూడా చదవండి: ‘హనుమాన్ జయంతి’ రోజున చిరంజీవి స్పెషల్ ట్వీట్! వీడియో వైరల్!విజ్ఞాన సర్వస్వంగా ప్రఖ్యాతి గాంచిన పాల్కురికి సోమనాథుడి ‘పండితారాధ్య చరిత్ర’లో సలేశ్వరం ప్రస్తావన ఉంది. ఈ గ్రంధం దీక్ష, పురాతన, వాద, మహిమ, పర్వతం అనే ఐదు ప్రకరణాల్లో పండితారాధ్యుని జీవితాన్ని తెలియజేస్తూ.. 13వ శతాబ్దికి చెందిన తెలుగువారి జీవితాన్ని సవివరంగా వర్ణించింది. పర్వతం ప్రకరణలో సలేశ్వర విశేషాలను పాల్కురి సోమనాధుడు విశేషంగా వర్ణించాడు. పర్వతం అంటే శైలం. శైలేశ్వరం కాస్త.. వ్యవహార భాషలో సలేశ్వరం అయ్యింది అంటున్న వాదనకు.. సోమనాథుడి రచన ఆధారంగా అంగీకరించబడుతున్నది.
ఎలా వెళ్లాలంటే..నల్లమల్ అభయారణ్యంలోని సలేశ్వరానికి వెళ్లాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. హైదరాబాద్, మహబూబ్ నగర్ మార్గాల గుండా వచ్చే భక్తులు మన్ననూరు నుంచి 16 కి.మీలు దాటాక పర్హాబాద్ బేస్ క్యాంపు వద్ద గల చెక్ పోస్టు నుంచి మట్టి మార్గంలో మరో 16 కి.మీ ప్రయాణిస్తే రాంపూర్ పెంట వస్తుంది. అక్కడి నుండి కాలి నడకన కొండలు దిగితే సలేశ్వర క్షేత్రం వస్తుంది. మరో మార్గం లింగాల మండలం అప్పాయిపల్లి నుంచి గిరిజా గుండాల వరకు వాహనాలు రానుండగా అక్కడ నుండి కాలి నడకన సలేశ్వరం చేరుకోవాల్సి ఉంటుంది. కాలి నడక ప్రాంతం అంతా కొండలు… గుట్టలు.. ఎత్తు పల్లాలు.. పెద్ద లోయలు.. జలపాతాలతో.. మార్గం అంతా రాళ్ళతో నిండి ఉంటుంది. వాటిని దాటుకుంటూ 5-6 కిలో మీటర్ల దూరం కాలినడక తప్పదు. ఈ నడకే ఒక సాహసం.. ఒక అద్భుతం. ఇంత దూరం శ్రమించి వచ్చిన భక్తులు.. భోళా శంకరుడిని దర్శించుకుని.. అంతసేపు పడిన శ్రమను మర్చిపోతారు.
శివ దర్శనం – మహిమసాహస యాత్రలో ఒకచోట సన్నని దారులు, వాటి వెంబడి నీళ్లు గారే వేళ్ళు…. వాటితో దాహర్తి తీర్చుకునే భక్తులు కనిపిస్తారు. అట్లాగే అక్కడక్కడా సాధువులు ఏర్పాటు చేసుకున్న లింగాలు దర్శనం ఇస్తాయి. ఆ తర్వాత లోతైన లోయలో శివుడి లింగరూప దర్శనం మహా భాగ్యమై అలరిస్తుంది. గుడి ముందు వీరభద్రుడు, గంగమ్మ విగ్రహాలున్నాయి. సుమారు రెండున్నర అడుగుల ఎత్తులో మీసాలతో వీరభద్రుడు వెలసి ఉన్నాడు. అతడికి నాలుగు చేతులు ఉన్నాయి. నాలుగు చేతులలో నాలుగు ఆయుధాలు వున్నాయి. కుడివైపు చేతుల్లో గొడ్డలి, కత్తి ఉన్నాయి. ఒక ఎడమ చేతిలో ఢమరుకం…. మరొక ఎడమ చేయి కిందికి వాలిన ఒక ఆయుదాన్ని పట్టుకుని వున్నది. గర్భగుడి ముఖ ద్వారానికి ఎడమ వైపున విడిగా రెండు గంగమ్మ విగ్రహాలున్నాయి.
స్థల పురాణం గురించి ప్రచారంలో ఉన్న కథలు..
సలేశ్వరం వద్ద చెంచుపెంటలో నివాసం ఉంటున్న గ్రామస్తులు చెప్పిన ప్రకారం.. కైలాసం నుంచి భూలోకానికి వచ్చి శివపార్వతులు.. ఇక్కడి పరిస్థితులను కళ్లారా చూస్తారు. పాపుల మాటలు శివుడికి అమిత బాధను కలిగిస్తాయి. ఆ శబ్దం వినపడని స్థలం కోసం వెతుకుతూ.. చివరకు ఆ లోయలోకి వెళ్లాడు. అక్కడ ఏ శబ్దం శంకరుడిని చేరలేదు. శివుడు లోయలోకి వెళ్లిన దారి గుండా జలపాతం ఏర్పడింది. అంటే గంగమ్మ తోడుగా వచ్చింది. ఇక శివుడిని వెతుక్కుంటూ పార్వతి దేవి రాళ్ళు రప్పలు దాటుకుని పతి దేవుడిని చేరుకుంది. అట్లా గంగ, గౌరీ ఇద్దరూ శంకరుడిని చేరుకున్నారు.
ఇది కూడా చదవండి: మాట నిలబెట్టుకున్న సీఎం… జూలై 1 నుంచి ఇళ్లకు ఉచిత కరెంట్!శివుడు లోయలోకి దిగిన తర్వాత కోపం తగ్గి ప్రశాంతంగా మారడు. తాను కొలువైన చోటు జనాలకు తెలియాలి అని భావించి.. జింక రూపం దాల్చి వేటకు వచ్చిన చెంచు వాడి దృష్టిలో పడ్డాడు. జింకను వెంబడిస్తూ.. లోయలోకి దిగిన చెంబువాడికి.. అక్కడ ఎక్కడా జింక కనబడలేదు. ఆ ప్రాంతం అంతా వెతికాడు. అక్కడ అతడికి ఓ లింగం కనబడింది. అంతే చెంచుకి శివుడి మహిమ అర్థం అయ్యింది. “శంకరా నీ జాడ చెప్పడం కోసం నన్ను రప్పించావా” అంటూ లింగం మీద పడిపోయాడు. అప్పటి నుంచి అక్కడ చెంచు పూజారులే పూజలు నిర్వహిస్తున్నారు.
ప్రకృతి అందాలతో పాటు.. ఆధ్యాత్మిక అనుభూతి పొందాలనుకునే వారికి సలేశ్వర యాత్ర చక్కగా సూట్ అవుతుంది. శని, ఆదివారాలు సెలవులు కలిసి వస్తాయి కనుక.. మీరు, కుటుంబ సభ్యులతో కలిసి సలేశ్వర యాత్ర చేసి.. అందమైన అనుభూతిని పొందండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.