ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ట్రిపుల్ ఆర్ జపమే. దీంతో పాటు మరో వ్యక్తి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. అదే ఈ చిత్ర నిర్మాత దానయ్య పేరు. ఆస్కార్ అందుకునే సమయంలోనే కాక, ప్రమోషన్స్, గోల్డెన్ గ్లోబ్ కోసం చేసిన ప్రమోషన్స్, అమెరికా, జపాన్లో ఆర్ఆర్ఆర్ విడుదల చేసిన సమయంలో కూడా దానయ్య ఎక్కడా కనిపించలేదు. తాజాగా దీనిపై సుమన్ టీవీకిచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు దానయ్య. ఆ వివరాలు..
ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు సాధించి.. తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది. నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుంది. ఆస్కార్ వేడుకలు పూర్తయినప్పటికి.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆస్కార్ ఫీవర్ ఇప్పట్లో వదిలేలా లేదు. ఆర్ఆర్ఆర్ సాధించిన విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక ఆస్కార్ కోసం అందరి కన్నా ఎక్కువగా రాజమౌళి కృషి చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాను మన దేశం నుంచి అధికారికంగా ఆస్కార్కు పంపకపోయినా.. ప్రైవేట్గా వెళ్లి.. పట్టుబట్టి మరీ ఆస్కార్ను ఇండియా తీసుకువచ్చారు రాజమౌళి. ఇక ఆస్కార్ అవార్డు ప్రధానం సందర్బంగా నాటు నాటు పాటతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరు న్యూయార్క్లో సందడి చేశారు. కానీ నిర్మాత డీవీవీ దానయ్య మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఆస్కార్ వేదికనే కాక గోల్డెన్ గ్లోబ్ అవార్డు, హెచ్సీఏ అవార్డులు అందుకునే సందర్భంలో కూడా దానయ్య లేడు.
ఈ క్రమంలో దానయ్య ఆస్కార్స్కు వెళ్లకపోవడంపై అనేక పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి. మరీ ముఖ్యంగా ఈ వివాదంలోకి చిరంజీవిని లాగుతూ వచ్చిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. ఆర్ఆర్ఆర్ సినిమాకు చిరంజీవి పెట్టుబడి పెట్టారని.. దానయ్య పేరుకే నిర్మాత అని.. లాభాలు కూడా చిరంజీవే తీసుకున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలపై తాజాగా స్పందించారు దానయ్య. సుమన్ టీవీకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. కాస్త ఘాటుగానే సమాధానం చెప్పారు దానయ్య.
‘‘నేను ఆస్కార్స్ ఫంక్షన్కి వెళ్లకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. దాని గురించి మీకెందుకు. నా సినిమాలకు ఫైనాన్షియర్లు డబ్బులు పెడతారు. చిరంజీవి గారు డబ్బులు పెట్టాలనుకుంటే.. ఆయన సొంత సినిమాకు పెడతారు. పైగా ఆయనకే సొంతంగా నిర్మాణ సంస్థ ఉంది. అలాంటప్పుడు ఆయన ఆర్ఆర్ఆర్ సినిమాకు ఎందుకు పెట్టుబడులు పెడతారు. అసలు ఇలాంటి వార్తలు ఎలా పుట్టిస్తారు.. వాళ్లకి కాస్త అయినా బుర్ర ఉందా.. కామన్ సెన్స్ లేని వాళ్లే.. ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తారు. ఈ పుకార్లు సృష్టించిన వారు ఎవరైనా నా ఆఫీస్కు వచ్చి.. అకౌంట్స్ చెక్ చేశారా. లేదు కదా. మరి తప్పుడు ప్రచారాలు ఎందుకు. నేను ఇలాంటి గాలి వార్తలను అస్సలు పట్టించుకోను. మరోసారి ఇలాంటి పుకార్లు క్రియేట్ చేయొద్దని కోరుకుంటున్నాను’’ అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. దానయ్య వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.