సోషల్ మీడియాలో చిన్న విషయమైనా, పెద్ద విషయమైనా పెద్దగానే స్పందిస్తుంటారు. వరంగల్ మెడికల్ కాలేజ్ విద్యార్థిని ప్రీతి సంఘటన అయినా, వీధి కుక్కల దాడిలో చనిపోయిన బాలుడు సంఘటన అయినా.. లేదా వేరే ఏ ఇష్యూ మీదనైనా, ఇతర అంశాల మీదనైనా నెటిజన్స్ గట్టిగానే స్పందిస్తుంటారు. అయితే ఓ విషయంలో నెటిజన్స్ తీరుని రకుల్ ప్రీత్ సింగ్ తప్పుబట్టింది. చిన్న విషయాన్ని ఎందుకు పెద్దది చేస్తున్నారని అంటూ మండిపడింది.
ప్రస్తుతం దక్షిణాది సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నాయి. బాలీవుడ్ లో కూడా తెలుగు సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. బాహుబలి, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ సినిమాల దెబ్బకి తెలుగు సినిమా సత్తా ఏంటో బయటపడింది. ఇదే క్రమంలో రొటీన్, రొట్ట సినిమాలతో బాలీవుడ్ ఇండస్ట్రీ చతికిలపడింది. బాలీవుడ్ ప్రేక్షకులే హిందీ సినిమాలను తిప్పికొట్టే పరిస్థితి నెలకొంది. చాలా రోజుల తర్వాత బ్రహ్మాస్త్ర, పఠాన్ వంటి సినిమాతో బాలీవుడ్ ఊపిరి పీల్చుకుంది. అయితే ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనుకునే బాలీవుడ్డోళ్లు కూడా కొంతమంది తెలుగు సినిమాని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. కొంతమంది మాత్రం అసూయతో రగిలిపోతున్నారు.
ఆ మధ్య జాన్ అబ్రహం కూడా మేమే నంబర్ వన్ అని, మేము రెండవ స్థానంలో ఉండము అంటూ కామెంట్స్ చేసి ట్రోలింగ్ కి గురయ్యాడు. ఇప్పటికీ బాలీవుడ్ వర్సెస్ సౌత్ సినిమాల మధ్య పోటీ కొనసాగుతుంది. ఎవరు గొప్ప అనే విషయం మీద సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతూనే ఉంది. మనవాళ్ళు బాలీవుడ్ సినిమాలకు అంత సీన్ లేదని ట్రోల్ చేస్తుంటే.. వాళ్ళు మన సినిమాలని ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయంపై స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది. హిందీ పరిశ్రమ నుంచి వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్.. కెరటం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సందీప్ కిషన్ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మొదటి హిట్ కొట్టింది. ఈ హిట్ తో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది.
ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, రవితేజ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. ఇప్పుడు బాలీవుడ్ లో సినిమాలు చేసుకుంటుంది. గత ఏడాదిలో అన్నీ హిందీ సినిమాలే చేస్తూ వచ్చిన రకుల్.. ఈ ఏడాది రెండు సినిమాల్లో నటిస్తోంది. వాటిలో ఒకటి తమిళ సినిమా ఇండియన్ 2 కాగా.. మరొకటి తెలుగు, తమిళంలో తెరకెక్కుతున్న సినిమా. ఇదిలా ఉంటే బాలీవుడ్ వర్సెస్ సౌత్ అంశంపై రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. సోషల్ మీడియాలో ఎందుకు ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారని, హిందీ చిత్రాలు, ప్రాంతీయ చిత్రాలు రెండూ ఒకటే అని, వాటిని ఒకదానితో మరొకటి పోల్చి చూడడం కరెక్ట్ కాదని వెల్లడించింది.
మన దేశంలో చాలా మంది గొప్ప దర్శకులు ఉన్నారని.. వారు మన భారత సినీ పరిశ్రమకు మంచి పేరు తెచ్చే సినిమాలను రూపొందించగలరని వెల్లడించింది. ఓ మీడియా ఇంటరేక్షన్ లో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే రకుల్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమాలను పట్టించుకోని బాలీవుడ్ ని కంపేర్ చేస్తుంటే కోపం వస్తుందా అంటూ మండిపడుతున్నారు. బాలీవుడ్ రక్తం కదా ఆ మాత్రం ప్రేమ ఉండడంలో తప్పు లేదు. దక్షిణాది సినిమాల ద్వారా గుర్తింపు పొంది.. ఇప్పుడు బాలీవడు పై ప్రేమ చూపిస్తున్నావా అంటూ రకుల్ ని ట్రోల్ చేస్తున్నారు. మరి రకుల్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.