సాధారణంగా సెలబ్రిటీలు దైవదర్శనాలకు వెళ్లడం చూస్తుంటాం. ఎప్పుడూ సినిమాలు, షూటింగ్స్ అంటూ బిజీగా ఉండే సెలబ్రిటీలు.. అప్పుడప్పుడు అలా దేవాలయాలను దర్శించుకొని.. కూల్ అవుతుంటారు. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. ఆయన సతీమణి తేజస్వినితో కలిసి పాలకొల్లులోని క్షీరరామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. రాజమండ్రి దగ్గరలో రామ్ చరణ్ – శంకర్ ల సినిమా షూటింగ్ జరుగుతుండగా.. భార్య తేజస్విని కోరిక మేరకు తాను ఈ క్షీరరామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చినట్లు దిల్ రాజు తెలిపారు. ప్రస్తుతం దిల్ రాజు దంపతుల దైవదర్శనం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సందర్భంగా క్షీరరామలింగేశ్వరస్వామి వారికి దిల్ రాజు దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం వేదం పండితులు దిల్ రాజు దంపతులను ఆశీర్వదించి.. ప్రసాదాలు అందజేశారు. అదే విధంగా శేషవస్త్రాలు.. అమ్మవారి చిత్రపటాన్ని కూడా దిల్ రాజు దంపతులకు అందించారు. అయితే.. ఇటీవలే ఈ దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. ఇక దిల్ రాజు, తేజస్వినిలకు లాక్ డౌన్ లో పెళ్లి జరిగింది. ఇదిలా ఉండగా.. దిల్ రాజు ప్రస్తుతం స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. రామ్ చరణ్ తో పాన్ ఇండియా మూవీ RC15, దళపతి విజయ్ తో వారసుడు చిత్రాలతో పాటు మరికొన్ని లైనప్ చేసినట్లు సమాచారం.