దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం మరో విశిష్ఠ పురస్కారాన్ని దక్కించుకుంది. ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతష్ఠాత్మకంగా భావించే ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డును ‘ఆర్ఆర్ఆర్’ దక్కించుకుంది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘ఆర్ఆర్ఆర్’ మూవీ నుంచి ‘నాటు నాటు’ పాటకు పురస్కారం వరించింది. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అవార్డును అందుకుని మురిసిపోయారు. ‘నాటు నాటు’కు అవార్డును ప్రకటించిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి, రామ్ చరణ్ చప్పట్లు కొడుతూ సందడి చేశారు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కాలిఫోర్నియాలోని ది బెవర్లీ హిల్టన్ హాల్ వేదికగా జరిగిన ‘గోల్డెన్ గ్లోబ్’ పురస్కారాల ప్రదానోత్సవ వేడుకకు తారక్, రాజమౌళి, కీరవాణి, చరణ్ కుటుంబసమేతంగా పాల్గొని సందడి చేశారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ మూవీకి ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా మూవీ యూనిట్ను మెచ్చుకుంటూ ట్విట్టర్లో ఓ పోస్టు పెట్టారు.
ప్రతి భారతీయుడు గర్వించేలా చేశారంటూ ‘ఆర్ఆర్ఆర్’ టీమ్పై మోడీ ప్రశంసలు కురిపించారు. ‘నాటు నాటు’ పాటను కంపోజ్ చేసిన కీరవాణితోపాటు సింగర్స్ కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, రచయిత చంద్రబోస్, దర్శకుడు రాజమౌళి, నటీనటులు తారక్, చరణ్ ఇలా పేరుపేరునా అందరికీ ఆయన అభినందనలు తెలిపారు. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ యూనిట్పై మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రశంసల జల్లులు కురిపించారు. ఇది చారిత్రాత్మక సమయం అని చిరు అన్నారు. దేశం మిమ్మల్ని చూసి గర్విస్తోందని.. అందరికీ కంగ్రాట్స్ అంటూ ఆయన ట్వీట్ చేశారు.