హీరోతో ప్రేమలో పడిపోయినట్లు.. స్టార్ హీరోయిన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అయితే వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది అంటూ మీడియా ఎప్పటి నుంచో కోడై కూస్తోంది. ఇద్దరు కలిసి షికార్లకు వెళ్లడం.. పార్టీలు అంటూ చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో.. ఇద్దరి మధ్య సమ్థింగ్ సమ్థింగ్ అంటూ ఎప్పటి నుంచో జోరుగా ప్రచారం సాగింది. అయితే ఆ వార్తలను సదరు హీరోయిన్, హీరో ఇద్దరు కొట్టి పారేయలేదు.. అలా అని కన్ఫామ్ చేయలేదు. ఇదుగో ఇప్పుడు మూడేళ్ల తర్వాత.. సోషల్ మీడియా వేదికగా.. తమ ప్రేమ గురించి వెల్లడించారు. ఇద్దరం ప్రేమించుకుంటున్నాం అని తెలిపారు. ప్రస్తుతం సదరు హీరోయిన్ చేసిన పోస్ట్ వైరలవుతోంది. ఇంతకు ఎవరా హీరోయిన్, హీరో అంటే..
మంజిమా మోహన్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. నాగ చైతన్య హీరోగా నటించిన సాహసం శ్వాసగా సాగిపో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ మధ్య వచ్చిన ఎఫ్ఐఆర్ చిత్రంలో కూడా నటించింది. ఇక ఈ బ్యూటీ హీరో గౌతమ్ కార్తీక్తో లవ్లో ఉన్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం అవుతోంది. కాగా అలనాటి మీరో నవరస నయగన్ కార్తీక్ తనయుడే ఈ గౌతమ్ కార్తీక్. ప్రస్తుతం అతడు కోలీవుడ్లో పలు చిత్రాల్లో నటిస్తూ.. బిజీగా ఉన్నాడు. ఇక వీరిద్దరూ కలిసి దేవరత్తమ్ సినిమాలో నటించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఏదో ఉందని కోలీవుడ్ మీడియా జోరుగా వార్తలు రాసుకొచ్చింది.
అయతే ఈ వార్తలపై మంజిమా మోహన్ స్పందిస్తూ.. కార్తీక్ ప్రేమను యాక్సెప్ట్ చేయలేదని.. ఒకవేళ నిజంగా అతడిని లవ్ చేస్తే.. అందరికీ కచ్చితంగా చెప్తానని ప్రకటించింది. అన్నట్లుగానే ప్రస్తుతం కార్తీక్ను లవ్ చేస్తున్న విషయం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది మంజిమా మోహన్. ‘‘మూడేళ్ల క్రితం నువ్వు నా జీవితంలోకి అడుగుపెట్టావ్. జీవితాన్ని ఎలా చూడాలో నేర్పించావు. క్లిష్ట పరిస్థితులు ఎదురైన ప్రతిసారి అందులో నుంచి నన్ను బయటకు తీసుకువచ్చావు. నాలా నేను ఎలా ఉండాలో నాకు నేర్పావు. నా మీద ఎంతో ప్రేమ కురిపించావు. అందుకే నీతో లవ్లో పడిపోయాను. నువ్వు ఎప్పటికీ నాకు ప్రత్యేకమే’’ అంటూ కార్తీక్తో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది మంజిమా. ప్రస్తుతం ఈపోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.
గౌతమ్ కూడా తమ గాఢమైన స్నేహం ప్రేమగా మారినందుకు సంతోషం వ్యక్తం చేశాడు. ఇక వీరి ప్రేమ గురించి తెలియడంతో ఫ్యాన్స్ కంగ్రాట్స్ తెలుపుతున్నారు. వెంటనే పెళ్లి చేసుకొండి.. మీ జంట సూపర్ క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.