సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘అవతార్-2’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 160 భాషల్లో విడుదలైంది. తెలుగు రాష్ట్రాలలో ఏ థియేటర్ లో చూసిన ఈ సినిమా సందడే కనిపిస్తోంది. సీట్లలో కూర్చొన్న ఆడియన్స్.. ఆ మూవీని చూస్తూ తమని తాము మైమరచిపోతున్నారట. పండోరా ప్రపంచంలో విహరిస్తున్నారట. అయితే.. తాజాగా ఈ సినిమా చూస్తూ ఆంధ్ర ప్రదేశ్లో ఓ వ్యక్తి మరణించాడు. ఈ విషాద ఘటన కాకినాడలోని పెద్దాపురంలో చోటు చేసుకుంది.
లక్ష్మిరెడ్డి శ్రీను అనే వ్యక్తి తన తమ్ముడు రాజుతో కలిసి అవతార్-2 సినిమాకు వెళ్లాడు. సినిమా చూస్తుండగా అతనికి గుండెపోటు వచ్చింది. ఉన్నట్టుండి నొప్పితో విలవిల్లాడటంతో.. వెంటనే అతని తమ్ముడు పెద్దాపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. కానీ, ఫలితం లేకపోయింది. శ్రీను అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్థారించారు. అతనికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. సినిమాకి వెళ్లిన అతను.. విగతజీవుడై ఇంటికి రావడంతో.. ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భార్య, పిల్లల రోదనలు మిన్నంటాయి.
హార్రర్ సినిమాలు చూస్తూ.. గుండెపోటుకు గురై మరణించిన ఘటనలు చాలానే ఉన్నాయి. కానీ.. అవతార్ 2 లో అలాంటి హార్రర్ సన్నివేశాలేమీ లేవు. ఆ విజువల్ ఎఫెక్ట్స్ చూసి కొందరు అమితానందానికి, ఉద్వేగానికి లోనైనపుడు రక్తపోటు కారణంగా గుండెనొప్పి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అవతార్ మొదటి భాగం విడుదలైనప్పుడు కూడా ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది. అప్పట్లో తైవాన్ లో 42 ఏళ్ల ఓ వ్యక్తి ఆ సినిమాను చూస్తూ థియేటర్లోనే ప్రాణాలు కోల్పోయాడు. అతడు సినిమా చూస్తూ బాగా ఉద్వేగానికి గురికావడంతో మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. ఇప్పుడు పెద్దాపురంలో చోటుచేసుకున్న ఘటన కూడా అటువంటిదే అయి ఉండొచ్చని తెలుస్తోంది.
A man died of a heart attack while watching the recently released movie ‘Avatar 2’ at a theatre in Peddapuram city in Andhra Pradesh’s Kakinada district.
.
.#news #story #india #andhrapradesh #kakinada #peddapuram #tollywood #movie #release #death #heartattack #avatar pic.twitter.com/35MduY5ECo— Hindustan Herald (@HeraldHindustan) December 17, 2022