పిల్లలకు ఆస్తి దక్కాలనే ఉద్దేశంతో ఓ ప్రముఖ నటుడు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఆయన మళ్లీ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఆ నటుడు ఎవరంటే..!
పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంతలా తపిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ సంతానం ఆలనాపాలన నుంచి వారు తమ లైఫ్లో సెటిలయ్యే వరకూ అన్నీ తామై నడిపిస్తారు. అంతేకాదు, ఆ తర్వాత మనవళ్ల పెంపకంలోనూ కీలక పాత్ర పోషిస్తారు. మిగతా దేశాల్లో ఏమో గానీ ఇండియాలోనైతే దీన్ని బాగా చూడొచ్చు. కెరీర్, బిజినెస్ కంటే కూడా కుటుంబానికి ప్రాధాన్యతను ఎక్కువగా ఇస్తుంటారు. ఇక, ఆస్తి విషయంలోనూ పిల్లలకు సమానంగా పంచుతుంటారు ఇక్కడి పేరెంట్స్. అయితే ఒక్కోసారి ఆస్తితగాదాలు రావడం సహజనమే. ఈ విషయాన్ని అటుంచితే.. కేరళకు చెందిన ప్రముఖ నటుడు, న్యాయవాది షుకూర్ ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకున్నారు. తన పిల్లలకు మొత్తం ఆస్తి దక్కాలనే ఉద్దేశంతో ఆయన మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు.
వివాహమైన దాదాపు 29 ఏళ్ల తర్వాత తన భార్యను మళ్లీ పెళ్లాడనున్నట్లు షుకూర్ ప్రకటించారు. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వీరి మ్యారేజ్ జరగనుంది. గతంలో ముస్లిం పర్సనల్ లా ప్రకారం వివాహం చేసుకున్నందున తన మరణం తర్వాత ముగ్గురు కుమార్తెలకు ఆస్తి పూర్తిగా లభించదని ఆయన తెలిపారు. తనకు కొడుకులు లేరు కాబట్టి మూడింట ఒక వంతు ఆస్తి తన సోదరులకు వెళ్తుందని షుకూర్ చెప్పారు. ఈ నేపథ్యంలో తన ఆస్తి మొత్తం కూతుళ్లకే దక్కే హక్కును కల్పిస్తున్న ప్రత్యేక వివాహ చట్టం కింద తన భార్యను సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పునర్వివాహం చేసుకుంటున్నట్లు షుకూర్ చెప్పుకొచ్చారు. 1994 అక్టోబర్ 6న షుకూర్, షీనా దంపతులకు ఫస్ట్టైమ్ మ్యారేజ్ జరిగింది.