ఇటీవల చిన్న సినిమాగా వచ్చి యావత్ దేశాన్ని షేక్ చేసిన చిత్రం ‘కాంతార’. సినిమాలో కంటెంట్ బాగుంటే ప్రాంతీయత అనేది ఎలాంటి అడ్డురాదని ప్రూవ్ చేస్తూ.. కాంతార చిత్రం దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో అద్భుతాలు సృష్టిస్తోంది. సెప్టెంబర్ 30న కేవలం కన్నడలో విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో.. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంతో పాటు హిందీ భాషలోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాలో క్లైమాక్స్ ఒక్కటే సినిమాకు ఆయువుపట్టుగా నిలిచిందని చెప్పవచ్చు. కేజీఎఫ్ సిరీస్ ని నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ వారు కాంతార మూవీని ప్రొడ్యూస్ చేశారు.
ఇక ఈ సినిమా ప్రారంభంలో.. క్లైమాక్స్ లో వచ్చే ‘వరాహ రూపం.. దైవ వరిష్టం..’ అనే పాట అందరినీ కాంతార మూవీలో లీనమయ్యేలా చేస్తోంది. సినిమాలో కథాకథనాలు, రిషబ్ శెట్టి నటనతో పాటు దైవత్వంతో కూడిన వరాహ రూపం సాంగ్ కూడా సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. అయితే.. తాజాగా ఈ పాటకు సంబంధించి వివాదం చోటుచేసుకుంది. వరాహ రూపం పాటను.. తమ ‘నవరసం’ పాట నుండి కాపీ చేశారంటూ కేరళకు చెందిన ‘తైక్కుడం బ్రిడ్జ్’ మ్యూజిక్ బ్యాండ్ వారు ఆరోపణలు చేశారు. దీంతో వరాహ రూపం సాంగ్ ఇష్యూ సోషల్ మీడియాలో, సినీ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.
అంతేగాక ‘తైక్కుడం బ్రిడ్జ్’ మ్యూజిక్ బ్యాండ్ వారు నెటిజన్స్ మద్ధతు కోరడం గమనార్హం. ‘కాంతార మూవీకి మాకు సంబంధం లేదు. కానీ.. మా ‘నవరస’ సాంగ్ కి, ‘కాంతార’లో వరాహ రూపం పాటకు మధ్య పోలికలు ఉన్నాయని.. కాబట్టి, కాపీకి కారణమైన వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నాం’ అని తైక్కుడం బ్రిడ్జ్ పేర్కొంది. అయితే.. సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అయిన ఇన్నిరోజుల తర్వాత తైక్కుడం బ్రిడ్జ్ వారు తెరపైకి రావడంతో అసలు వారు ఏం ఆశించి ఆరోపణలు చేస్తున్నారు? అనే దిశగా చర్చలు మొదలయ్యాయి. అదీగాక ఈ వివాదంలో మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్, రిషబ్ శెట్టి, ప్రొడ్యూసర్ విజయ్ లు కూడా ఇప్పటివరకు ఏమి స్పందించలేదు.
ఈ క్రమంలో కాంతార సాంగ్.. మలయాళ నవరసకు కాపీ అని ఆరోపించడం వలన ఎవరికి లాభం జరుగుతుందని ఆరా తీస్తే.. కాంతార మూవీకే అని అంటున్నాయి సినీ వర్గాలు. ఎందుకంటే.. సినిమాలో వరాహ రూపం సాంగ్ కాపీనా కాదా? అని చూడడానికైనా సినిమా చూడనివారు వెళ్లి చూస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు నవరస సాంగ్ కి కూడా వ్యూస్ పరంగా ఉపయోగం ఉంది. అయితే.. ఈ వివాదంపై కాంతార టీమ్ స్పందించకపోతే మాత్రం నష్టం తప్పదనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి ఇకనైనా ఈ వివాదంపై కాంతార దర్శకుడు రిషబ్ శెట్టి, నిర్మాత విజయ్ కిరగందుర్ స్పందిస్తే బాగుంటుందని టాక్. చూడాలి మరి ఎలా రియాక్ట్ అవుతారో!