‘జబర్దస్త్’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోలు చూసేవాళ్లకు హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లాంటి వాళ్లు ఎంత తెలుసో.. పంచ్ ప్రసాద్ కూడా అంతే బాగా తెలుసు. చాలా ఏళ్ల నుంచి పలు షోల్లో చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న ప్రసాద్.. పలువురు టీమ్స్ లో కమెడియన్స్ చేశాడు. తన స్పాంటేనిటి పంచులతో కితకితలు పెట్టించే ప్రసాద్ కి కిడ్నీ ప్రాబ్లమ్ ఉంది. అలా అని దాన్ని దాచుకోలేదు. చాలా సందర్భాల్లో బయటపెట్టాడు. అప్పుడప్పుడు తన ప్రాబ్లమ్ గురించి చెప్పి నవ్వించాడు కూడా. కానీ ఇప్పుడు మాత్రం అంతకంటే పెద్ద సమస్య ప్రసాద్ కి ఎదురైంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. కమెడియన్ పంచ్ ప్రసాద్ ఎప్పుడు, ఏ షోలో కనిపించినా సరే ఫుల్ కామెడీ చేస్తుంటాడు. ఆది, సుధీర్, గెటప్ శ్రీను.. ఎవరైనా సరే ప్రసాద్ పంచులు వేస్తే సైలెంట్ అయిపోతారు. అలాంటి అతడికి గత కొన్నేళ్ల నుంచి కిడ్నీ సమస్య వేధిస్తోంది. అయినా సరే షోల్లో యాక్టివ్ గా ఉంటూ కామెడీ చేస్తూ వస్తున్నాడు. ప్రతి వారం డయాలసిస్ చేసుకుంటున్నా సరే తన నొప్పిని బయటకు రానివ్వకుండా నలుగురిని నవ్విస్తూ వస్తున్నాడు. అయితే ఇప్పుడు ఏకంగా నడవలేని స్థితిలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
ఇక పంచ్ ప్రసాద్ యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసిన వ్లాగ్ ప్రకారం.. కమెడియన్ జోడీ నూకరాజు, ఆసియా గత వారం నుంచి ప్రసాద్ ఇంట్లోనే ఉన్నారు. ప్రసాద్ కి సాయం చేస్తున్నామని చెప్పారు. ఇక పంచ్ ప్రసాద్ భార్య చెప్పిన దాని ప్రకారం.. ఓరోజు షూటింగ్ తర్వాత ఫీవర్ గా ఉందని ఇంటికొచ్చిన ప్రసాద్.. నడుము నొప్పితో చాలా బాధపడ్డారు. అలా నడవలేక చాలా ఇబ్బందిపడ్డారు. డాక్టర్స్ కూడా ఫస్ట్ ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాలేదని, టెస్టులు చేస్తే నడుము వెనక వైపు కుడికాలి వరకు చీము పట్టేసినట్లు తెలిసింది అని ఆమె చెప్పింది. ప్రసాద్ కి ఇష్టం లేకపోయినా సరే ఈ మొత్తాన్ని షూట్ చేసి యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేసినట్లు నూకరాజు చెప్పుకొచ్చాడు. అభిమానులు కూడా ప్రసాద్ కి సపోర్ట్ చేయాలని కోరాడు. ప్రస్తుతం నెటిజన్లకు ఈ విషయం కంటతడి పెట్టిస్తోంది.