కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ గతేడాది అక్టోబర్ నెలలో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపై దక్షిణాది ఇండస్ట్రీ మొత్తం సంతాపం వ్యక్తం చేసింది. పలువురు టాలీవుడ్ హీరోలు కూడా బెంగళూరు వెళ్లి.. పునీత్ కు నివాళులు అర్పించారు. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పునీత్ మరణించిన సమయంలో పుష్ప సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. దాంతో ఆయన వారి కుటుంబ సభ్యులను పరామర్శించలేకపోయారు.
పుష్ప ప్రమోషన్ సమయంలో బెంగళూరు వెళ్లిన బన్నీ.. ఈ సమయంలో పునీత్ ఇంటికి వెళ్లడం కరెక్ట్ కాదని.. మరోసారి బెంగుళూరు వచ్చి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తానన్నారు. అందులో భాగంగా అల్లు అర్జున్ ఇవాళ బెంగళూరు వెళ్లారు. ముందుగా పునీత్ రాజ్ కుమార్ అన్నయ్య శివ రాజ్ కుమార్ను కలిశారు. అనంతరం పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ తర్వాత పునీత్ రాజ్ కుమార్ సమాధిని బన్నీ సందర్శించారు.
అల్లు అర్జున్ ఇటీవల డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేసిన సంగతి తెలిసిందే. గతేడాది విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో బన్నీ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నటించింది. పునీత్ రాజ్ కుమార్ మరణం సమయంలో బన్నీ పుష్ప షూటింగ్ లో ఉండడం వలన ఆయన అంత్యక్రియాలకు రాలేకపోయినట్లుగా గతంలో తెలిపారు. పునీత్ రాజ్కుమార్ విషయానికి వస్తే.. కన్నడ పరిశ్రమలో సూపర్స్టార్, పవర్ స్టార్గా పేరున్న హీరో అక్టోబర్ 29, 2021న గుండెపోటుతో మరణించారు. ఆయన మరణంతో దేశవ్యాప్తంగా సినీ అభిమానులు, ప్రముఖులు తల్లడిల్లిపోయారు. ఆయన మరణంతో కన్నడ ప్రజలు శోక సంద్రంలో మునిగిపోయారు.