ప్రస్తుతం సినీ పరిశ్రమలో వారసులదే హవా. పాత తరం నుండి ఇప్పటి తరం నటీనటులు వరకు వారి వారసులు అనేక మంది తెలుగు తెరకు పరిచయమయ్యారు. కొందరు విజయం సాధిస్తుంటే, మరికొందరు ఫెయిల్యూర్ అవుతున్నారు. అయితే ప్రతి ఇండస్ట్రీలోనూ వారసులున్నప్పటికీ, నెగిటివిటీ.. సినీ పరిశ్రమపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. ఓ పేరు మోసిన సినీ ఫ్యామిలీ నుండి వారసుడు ఎంట్రీ అవుతున్నాడంటే ఆలస్యం నెపోటిజం అంటూ వారికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ ఫేమ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టేంత వరకు సాయం చేయగలదేమో కానీ, నిలదొక్కుకోవాలంటే మాత్రం వారికి టాలెంట్ కచ్చితం. దానికి అనేక మంది వారసులు ఉదాహరణులుగా నిలిచారు. ఇప్పుడు ఇదే విషయాన్ని టాలీవుడ్ నట సింహం బాలయ్య కూడా ప్రస్తావించారు.
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటించిన సినిమా వేదను తెలుగులో విడుదల చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ లో కన్నడలో విడుదల ఆ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు శివ వేద పేరుతో తెలుగులో ఈ నెల 9న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం సాయంత్రం జరిగింది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా బాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ కుటుంబంతో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. శివరాజ్ కుమార్ తండ్రి రాజ్ కుమార్ తో పాటు ఏఎన్నార్ ను చిత్తప్ప (చిన్నాన్న) అని పిలిచేవాడని పేర్కొన్నారు. ఈ సినిమాకు శివరాజ్ భార్య గీత నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దీని గురించి ప్రస్తావిస్తూ మహిళా సాధికారితకు నిదర్శనమని పొగిడారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ వారసత్వంపై పలు కామెంట్లు చేశారు. శివ రాజ్ కుమార్ రకరకాల పాత్రలు చేశారని, ఆ పాత్రల్లో నటించడమంటే పరకాయ ప్రవేశం చేయడమేనని తెలిపారు. ఇందుకు నిదర్శనం రాజ్ కుమార్, తన తండ్రి ఎన్టీఆర్ లే నిదర్శనమని చెప్పారు. అటువంటి తల్లిదండ్రులకు తాము జన్మించడం.. ఇరువురు చేసుకున్న అదృష్టమని అన్నారు. ఎందుకంటే వారసత్వాన్ని తీసుకెళ్లడమంటే ఎంతో బాధ్యతతో కూడుకున్నదని, అయితే వారి పేర్లు చెప్పుకుని ఎంత కాలం దాన్ని మోసుకెళ్లలేమని అన్నారు. వాళ్ల పోషణలో, పెంపకంలో రాటు దేలాలని, ఒక సినిమా ద్వారా వారసత్వాన్ని మాత్రమే తీసుకెళ్లకుండా తమకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఈ విషయంలో రాజ్ కుమార్ ముగ్గురు సోదరులు విజయం సాధించారన్నారు.
దివంగత నటుడు, శివరాజ్ కుమార్ తమ్మడు పునీత్ రాజ్ కుమార్ గురించి మాట్లాడుతూ.. ఆయన స్థాయి, స్థానం వేరని, కేవలం నటుడిగానే కాకుండా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన సంపాదించిన పేరు శాశ్వతంగా నిలుస్తుందని అన్నారు. ఈ సినిమా ట్రైలర్ బాగుందని మూవీ దర్శకుడు హర్షను పొగిడిన ఆయన, ఈ సినిమా విజయం సాధించాలని ఆకాక్షించారు. కాగా, తాత, తండ్రి పేర్లను చెప్పుకుంటూ ఎంత కాలం నెట్టుకొస్తామన్నా బాలయ్య వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.