థియేటర్ లో విడుదలైన రోజునే కొత్త సినిమాను ఇంట్లో కూర్చుని చూడాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఇకపై ఇంట్లో కూర్చుని కొత్త సినిమా చూసేలా ఏపీఎస్ఎఫ్ఎల్ ఏర్పాట్లు చేస్తోంది.
సినిమా రిలీజ్ రోజున చూస్తే ఆ కిక్కే వేరు అని చాలా మంది భావిస్తారు. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని భావిస్తుంటారు. అయితే రిలీజ్ రోజున రద్దీ ఉంటుందని చాలా మంది తర్వాత రోజు వెళ్తారు. లేదా వేరే షోకి వెళ్తారు. నిజానికి వీరికి కూడా కొత్త సినిమా విడుదలైన రోజునే చూడాలని అనుకుంటారు. కానీ అభిమానుల ఈలలు, కేకలు, చప్పట్ల చప్పుళ్ల మధ్య సినిమా అర్థం కాదు. ఇలాంటి వారు ఇంట్లోనే కూర్చుని విడుదలైన రోజునే సినిమా చూసే అవకాశం వస్తే ఎలా ఉంటుంది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పిస్తుంది. థియేటర్ లో విడుదలైన రోజునే కొత్త సినిమాని చూసేయచ్చు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ సంస్థ ఏపీ సినీ ప్రేక్షకులకు శుభవార్త చెప్పింది.
ఫైబర్ నెట్ సదుపాయం ఉన్న వారు ఇకపై ఇంట్లోనే కొత్త సినిమాలు చూసే అవకాశం కల్పించనుంది ఏపీఎస్ఎఫ్ఎల్. థియేటర్ తరహాలోనే మొదటి రోజు, మొదటి షో చూసే వెసులుబాటుని తీసుకొస్తున్నట్లు ఏపీఎస్ఎఫ్ఎల్ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి వెల్లడించారు. థియేటర్ లో ఏ రోజైతే సినిమా విడుదలవుతుందో అదే రోజున ఏపీఎస్ఎఫ్ఎల్ ప్రేక్షకులు చూసే సదుపాయాన్ని కల్పిస్తున్నామని అన్నారు. ఐతే రిలీజ్ రోజున సినిమా చూడాలంటే నెలకొకసారి కాకుండా రోజుకొకసారి రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుందని అన్నారు. కొత్త సినిమాలను సబ్ స్క్రైబ్ చేసుకునేవారికి 24 గంటల పాటు ఆ సినిమా అందుబాటులో ఉంటుందని అన్నారు.
నిర్మాతలతో మాట్లాడిన తర్వాత సినిమా రిలీజ్ అవుతుందని, ఇది ఓటీటీ ప్లాట్ ఫామ్ కాదని అన్నారు. జూన్ 2న విశాఖ వేదికగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని, మూడు నెలల్లో పూర్తి స్థాయిలో సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని గౌతమ్ రెడ్డి అన్నారు. ఇప్పటికే సినీ రంగ ప్రముఖులతో చర్చలు జరిపామని, పెద్ద సినిమాల విషయంలో కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇది అమలైతే కనుక చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అని తేడా లేకుండా కుటుంబం మొత్తం తక్కువ ధరకు రిలీజ్ రోజునే ఇంట్లో కూర్చుని హ్యాపీగా సినిమా చూడవచ్చు. 24 గంటలు సినిమా అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎలాంటి అంతరాయం కలిగినా ఏదో ఒక సమయంలో వీలు చూసుకుని చూడవచ్చు. మరి ఈ సరికొత్త విధానాన్ని తీసుకొస్తున్న ఏపీఎస్ఎఫ్ఎల్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.