ఇటీవల దేశ వ్యాప్తంగా ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అధిక వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. ఈ రోజు తెల్లవారుజామున నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో సినీ రచయిత, దర్శకుడు రాజసింహ తకినాడ కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే..
నంద్యాల నేషనల్ హైవే పై ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న రచయిత, దర్శకుడు అయిన రాజసింహ తకినాడ ఒక వాహనాన్ని తప్పించబోయి… ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీ కొట్టాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై నర్సింలు తో పాటు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని 108 కి ఫోన్ చేసి ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.. అక్కడ ప్రథమ చికిత్స చేసిన తర్వాత మెరుగైన చికిత్స కోసం నంద్యాల ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆయన ఎడమకాలు విరిగినట్లు సమాచారం.
రాజసింహ కెరీర్ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు ఆయన 60 చిత్రాలకు రచయితగా పనిచేశారు. గుణ శేఖర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘రుద్రమదేవి’ చిత్రానికి డైలాగ్ రైటర్ గా పనిచేశారు. ఈ చిత్రంలో గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ నటించిన విషయం తెలిసిందే. తెలంగాణ యాసలో అల్లు అర్జున్ పలికే డైలాగ్స్ కి ఎంతో క్రేజ్ వచ్చింది.. ఆ డైలాగ్స్ రాసింది రాజసింహ. రచయితగా కొనసాగుతూనే దర్శకుడిగా సందీప్ కిషన్ తో ‘ఒక అమ్మాయి తప్ప’మూవీ తెరకెక్కించాడు. కాకపోతే ఈ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఆయనకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి.