శేఖర్ కమ్ముల.. అస్సలు వివాదాల జోలికి రాకుండా తన పని తాను చేసుకెళ్లే దర్శకుడు. అయితే.. కమ్ముల ఏ ముహూర్తాన లవ్ స్టోరీ మూవీని స్టార్ట్ చేశాడో తెలియదు గాని.. ఈ సినిమా వరుస వివాదాలకి కారణం అవుతోంది. మొదట్లో “సారంగ దరియా” పాట చుట్టూ ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. అయితే.. ఇప్పుడు ట్రైలర్ విడుదల అయ్యాక కూడా లవ్ స్టోరీ సినిమా పై కొత్త వివాదం మొదలైంది.
లవ్ స్టోరీ ట్రైలర్ చూస్తే.. మూవీ ఒక ప్యూర్ లవ్ స్టోరీ అని క్లియర్ గా అర్ధం అవుతోంది. నాగచైతన్య, సాయిపల్లవి జోడీ తెరపై అద్భుతంగా కనిపిస్తోంది. ఇక ఈ వీరి క్యారెక్టర్స్ తెలంగాణ యాసలో పలికించిన డైలాగ్స్ కూడా సూపర్బ్ గా సెట్ అయ్యాయి. అయితే.. ఇప్పుడు తెలంగాణ యాసలో హీరో క్యారెక్టర్ చెప్పిన ఒకే ఒక్క డైలాగ్ వివాదానికి కారణం అయ్యింది.
లవ్ స్టోరీ ట్రైలర్ లో హీరో లోన్ కోసం ప్రయత్నం చేసే చిన్న సీన్ ఉంది. హీరో బ్యాంక్కు వెళ్లిన సమయంలో గొర్రెలోడికి గొర్రెలిస్తే వాడు గొర్రెలనే మేపుతాడు.. రిక్షావాడికి కొత్త రిక్షా ఇస్తే వాడు రిక్షానే తొక్కుతాడు అంటూ ఓ డైలాగ్ చెప్తాడు. ఇప్పుడు ఈ డైలాగ్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ప్రజలకి గొర్రెల పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ విషయంపై కొన్ని విమర్శలు కూడా చెలరేగాయి. ఇప్పుడు.. లవ్ స్టోరీ మూవీలో శేఖర్ కమ్ముల ఈ డైలాగ్స్ వాడటంతో గులాబీ నాయకులు ఫైర్ అవుతున్నారు. ప్రతి ఒక్కళ్ళూ సర్కార్ పథకాల పై సెటర్స్ వేసేవాళ్ళే అంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. ఇక ఈ నెల 24న విడుదల కాబోతున్న లవ్ స్టోరీ మూవీ ఇప్పటికే సెన్సార్ ని పూర్తి చేసుకుని, U/A సర్టిఫికెట్ అందుకోవడం విశేషం. మరి.. ఈ గొర్రెల పంపిణీ డైలాగ్ విషయంలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.