జైల్లో చదువుకుని విడుదలయ్యాక మంచి పొజిషన్ లో స్థిరపడ్డవారిని చూసుకుంటారు. కానీ జైల్లో ఉంటూ ప్రేమించుకున్న ఖైదీలను చూశారా? పెరోల్ పై వచ్చి పెళ్లి కూడా చేసుకున్నారు.
ఆవేశంలో హత్యలు చేసి జైలుకు వెళ్లిన వారు చదువుకుని ప్రయోజకులు అయిన సంఘటనలు మనం చూశాం. సింహాద్రి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఒక యువతిని కాపాడబోయి ఆమెపై అత్యాచారం చేస్తున్న వ్యక్తిని పొరపాటున హత్య చేసి జైలుకు వెళ్తాడు. జైలులోనే చదువుకుంటూ లాయర్ అవుతాడు. ఇలాంటి ఘటనలు రియల్ లైఫ్ లో కూడా చోటు చేసుకున్నాయి. తెలిసి తెలియని వయసులో హత్యలు చేసి జైలుకెళ్లిన బాలురు కూడా చదువుకుని ప్రయోజకులు అవుతారు. ఇలాంటి సన్నివేశాలు సినిమాల్లోనే కాకుండా.. రియల్ లైఫ్ లో కూడా జరుగుతాయి. అయితే చదువుకునే వయసు కాదు కాబట్టి ఓ జంట జైల్లోనే ప్రేమించుకోవడం మొదలుపెట్టారు.
అవును జైల్లో ఇద్దరు ఖైదీలు ప్రేమించుకున్నారు. ప్రేమించుకోవడమే కాదు.. పెరోల్ మీద బయటకు వచ్చి పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకుంది. అస్సాంకి చెందిన అబ్దుల్ హసీమ్, పశ్చిమబెంగాల్ కి చెందిన షానారా ఖతున్ వేర్వేరు హత్య కేసుల్లో పశ్చిమ బెంగాల్ లోని బర్ధమాన్ సెంట్రల్ కరెక్షనల్ హోమ్ లో ఖైదు చేయబడ్డారు. అక్కడకు వచ్చే వరకూ ఒకరితో ఒకరికి సంబంధం లేదు. జైలుకొచ్చాకే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. హసీమ్ 8 ఏళ్ళు జైలు శిక్ష పడగా.. షానారాకి 6 ఏళ్ళు జైలు శిక్ష పడింది. ఇద్దరూ ఒకే జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. జైల్లో అపరిచయస్తులుగా ఉన్న ఇద్దరూ పరిచయం పెంచుకుని స్నేహితులుగా మారారు. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది.
దీంతో ఇద్దరూ ఇంట్లో పెద్దవారిని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇరు కుటుంబాల వారు ఒప్పుకోవడంతో ఇద్దరూ 5 రోజులు పెరోల్ మీద బయటకొచ్చారు. అనంతరం ముస్లిం వివాహ చట్టం ప్రకారం తూర్పు బర్ధమాన్ లో మోంటేశ్వర్ బ్లాక్ కుసుమ్ గ్రామ్ లో ఇద్దరూ ఒకటయ్యారు. పెరోల్ మీద బయటకు రావడంతో ఇద్దరికీ చాలా తక్కువ సమయమే దొరికింది. దీంతో పెరోల్ గడువు ముగియడంతో వారిద్దరూ తిరిగి జైలుకు వెళ్లిపోయారు. జైలు నుంచి విడుదలయ్యాక ఇద్దరం కలిసి జీవనం సాగిస్తామని నూతన దంపతులు వెల్లడించారు. మరి కాలం వీరి కోసం ఎంత వేగంగా పరుగులు పెడుతుందో చూడాలి.