యువతీ యువకుడు ప్రేమించుకోవడం సాధారణ విషయమే కానీ అక్కడ మాత్రం ఇద్దరు యువకుల మధ్య ప్రేమ చిగురించింది. అది గాఢంగా మారి పెళ్లికి దారితీసింది. దీనికోసం లింగమార్పిడి చేయించుకున్నాడు ఆ యువకుడు.
ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో తెలియదు. ప్రేమకు వయసు, కులమతాలు, ఆస్థి అంతస్తులు ఇవేమీ అడ్డుకావు. ఈ రోజుల్లో ప్రేమ కోసం యువతీ యవకులు దేనికైన తెగిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పరిచయమై తర్వాత హద్దులు, సరిహద్దులు దాటి మరి తమ ప్రియుడు లేదా ప్రియురాలి కోసం వెళ్తున్నారు. అయితే ప్రేమైనా పెళ్లైనా ఇద్దరు యువతీయువకుల మధ్య జరిగే అత్యంత మధురమైన సంఘటన. ఇదిలా ఉంటే ఏపీలో ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పురుషుల మధ్య ప్రేమ వ్యవహారం వెలుగుచూసింది. ప్రియుడికోసం ట్రాన్స్ జెండర్ గా మారిన అతడికి ఊహించని షాక్ తగిలింది. అసలు ఏం జరిగిందంటే?
బెజవాడలో ఒక వ్యక్తితో మరో వ్యక్తి ప్రేమలో పడ్డాడు. ఇది వినడానికి విడ్డూరంగా ఉన్న జరిగిన సంఘటన మాత్రం నిజమే. పవన్, ఎలి నాగేశ్వరరావు అనే ఇద్దరు వ్యక్తులు ఓ కాలేజీలో చదువుతున్న సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలో పవన్ అనే వ్యక్తి లింగమార్పిడి చేయించుకోవడం కోసం సిద్దమయ్యాడు. అందుకోసం ఢిల్లీకి వెళ్లి లక్షలు వెచ్చించి ట్రాన్స్ జెండర్ గా మారాడు.
లింగ మార్పిడి చేయించుకున్న తర్వాత తన పేరును భ్రమరాంబగా మార్చుకుంది. ఇక అసలు కథ ఇక్కడే మొదలయ్యింది. ఇక ప్రియుడిని పెళ్లి చేసుకుని సంతోషంగా గడుపుదామని అనుకున్న భ్రమరాంబకు షాక్ ఇచ్చాడు ప్రియుడు. పెళ్లి చేసుకోనని నాగేశ్వర్ రావు తెగేసి చెప్పాడు. అంతేగాక ఆమెను దూరం పెట్టసాగాడు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.