నందమూరి బాలకృష్ణ.. ఒక మాస్ హీరోగా ఆయనకున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత రెండ్రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలు, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆయన గురించే వార్తలు వైరల్ అవుతున్నాయి. వీర సింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ లో బాలయ్య కొన్ని వ్యాఖ్యలు చేయడం చూశాం. అక్కినేనిపై నోరు జారారంటూ ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెట్టింట బాలయ్యకు సంబంధించి కొన్ని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. గత కొద్దికాలంగా బాలయ్య విషయంలో కూతురు పడిన కష్టం మొత్తం వృథా అయ్యిందని కామెంట్ చేస్తున్నారు. అసలు ఆ కష్టం ఏంటి? అది ఎలా వృథా అయ్యింది అనే విషయాలను పరిశీలిద్దాం.
నటసింహంగా నందమూరి బాలకృష్ణ చరిష్మా, మాస్ క్రేజ్ గురించి ఎవరూ ప్రశ్నించడానికి లేదు. కానీ, వ్యక్తిత్వం పరంగా గతంలో ఆయనకు నెగిటివిటీ ఉండేది. ఆయన.. అభిమానులను కొట్టడం, ప్రేమగా దగ్గరికి వచ్చిన వారిని చిరాకు పడటం, పలు సందర్భాల్లో కటువుగా మాట్లాడటం చేశారు. ఈ ప్రవర్తన చూసి హీరోగా వెండితెరపై జేజేలు పలికినా కూడా వ్యక్తిత్వం పరంగా కొంత మంది మాత్రం కాస్త దూరంగా ఉండేవాళ్లు. అయితే ఆ నెగిటివిటీ, ఆ కామెంట్స్ ని ఆయన చిన్న కుమార్తె తేజశ్విని మార్చేశారు. బాలయ్య అంటే మీరు చూసేది కాదు.. అసలు బాలయ్య ఇలా ఉంటారు అంటూ తేజశ్విని చూపించింది.
ఇటీవల బాలయ్య నుంచి వచ్చిన ప్రాజెక్టులు అన్నీ సూపర్ హిట్టే. బాలయ్య అఖండ బ్లాక్ బస్టర్ అయ్యింది. వీర సింహారెడ్డి డీసెంట్ హిట్ కొట్టింది. ఇంక అన్ స్టాపబుల్ షో అయితే దేశవ్యాప్తంగా నంబర్ వన్ టాక్ షోగా నిలిచింది. మొదటి సీజన్ పూర్తి చేసుకుని.. రెండో సీజన్ ని కూడా సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తోంది. నిజానికి అన్ స్టాపబుల్ షో విషయంలో బాలయ్య కుమార్తె కష్టాన్ని ప్రత్యేకంగా చెప్పాలి. ప్రేక్షకులు చూసే బాలయ్యకు అసలు బాలయ్యకు ఎంతో తేడా ఉంది అని ఆమె నిరూపించారు. తనకు తెలిసిన బాలకృష్ణను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆయన ఎలా ఉంటారు? ఎలా మాట్లాడతారు? ఎంతలా కలిసిపోతారు? అనే విషయాలను తెలియజెప్పారు.
అన్ స్టాపబుల్ షోలో బాలయ్యని చూసి తెలుగు ప్రేక్షకులు నమ్మలేకపోయారు. బాలకృష్ణ ఇంత బాగా మాట్లాడతారా, ఇంత మంచిగా ఉంటారా అని తెలుసుకున్నారు. అలాగే ఈ మధ్యకాలంలో ఆయన చేసిన సాయాలు, క్యాన్సర్ పేషెంట్స్ కి అందించే చేయూత వంటి అంశాలను తెలుసుకుని తెలుగు ప్రేక్షకులు బాలయ్య మంచి మనసుకు ఫిదా అయిపోయారు. ఈ మధ్యకాలంలో బాలకృష్ణకు ఎంతో పాజిటివిటీ వచ్చింది. ఇంతకాలం బాలయ్యను తప్పుగా అర్థం చేసుకున్నామని భావించారు. బాలయ్య బంగారం అంటూ నెట్టింట కామెంట్స్ వెల్లువెత్తాయి.
అయితే ఇప్పుడు ఆ సీన్ మళ్లీ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. తాజాగా అక్కినేనిపై బాలయ్య చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ వ్యాఖ్యలతో బాలయ్యపై మరోసారి నెగిటివిటీ జోరందుకుంది. అక్కినేని అభిమాన సంఘాలు బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటివరకు వచ్చిన ప్రశంసలు, పాజిటివిటీ మళ్లీ నెగిటివ్ గా మారిపోయిందంటున్నారు. నెట్టింట బాలయ్యపై మరోసారి ట్రోల్స్ స్టార్ట్ అయ్యినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా తేజశ్విని పడిన కష్టం మొత్తం వృథా అయ్యిందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.