సినిమా ఇండస్ట్రీలో కాపీ వ్యవహరం సర్వ సాధారణం. కాపీ విమర్శలు ఎదుర్కొనే వారిలో దిగ్గజాలు మొదలు.. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి వస్తున్న వారు కూడా ఉంటున్నారు. తాజాగా తెలంగాణ భాష, యాస, ఇక్కడి సంప్రదాయం నేపథ్యంలో తెరకెక్కిన బలగం చిత్రం కూడా ఇలానే కాపీ విమర్శలు ముట్టగట్టుకుంది. ఆ వివరాలు..
క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. కమెడియన్గా గుర్తింపు తెచ్చుకున్నాడు వేణు. జబర్దస్త్ తర్వాత వేణు కెరీర్ పూర్తిగా మారిపోయింది. సినిమాల వల్ల రాని గుర్తింపు ఈ షో ద్వారా సంపాదించుకున్నాడు వేణు. ఆ తర్వాత సినిమాల్లో మంచి పాత్రలు, కమెడియన్గా నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తాజాగా బలగం సినిమా ద్వారా మెగా ఫోన్ పట్టాడు వేణు. దిల్ రాజు బ్యానర్లో.. ప్రియదర్శి హీరోగా, వేణు దర్శకుడిగా పరిచయం అవుతూ బలగం సినిమా తెరకెక్కింది. ఫిబ్రవరి 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూర్తి స్థాయి తెలంగాణ యాసలో, ఇక్కడి మట్టి పరిమళాలను, మట్టి మనసుల అమాయకత్వాన్ని ప్రతిబింబిస్తూ.. ఎంతో సున్నితమైన కథతో బలగం సినిమా తెరకెక్కింది. బలగం అంటే అర్థం.. బంధుగణం. చిన్న బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
అయితే సినిమా విజయం సాధించడం సంగతి పక్కకు పెడితే.. బలగం కథపై, దర్శకుడు వేణు, దిల్ రాజుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. గడ్డం సతీష్ అనే రచయిత.. ఈ కథ తనదే అని వాదిస్తున్నాడు. అంతేకాక అందుకు బలమైన ఆధారాలు కూడా చూపుతున్నాడు. బలగం సినిమా కథలోని లైన్నే.. గడ్డం సతీష్ 2014లో పచ్చికి పేరుతో కథ రాశాడు. దాన్ని ఓ ప్రముఖ మీడియా సంస్థ తన ఆదివారం అనుబంధంలో ప్రచురించింది. పచ్చికి అంటే పక్షి అని అర్థం. సాధారణంగా తెలంగాణ ప్రాంతంలో మనిషి చనిపోతే.. మూడు, ఐదు, తొమ్మిది, 11వ రోజు నాడు.. చనిపోయిన వ్యక్తికి ఇష్టమైన పదార్థాలను వండి తీసుకెళ్లి.. పక్షికి పెడతారు. చనిపోయిన వ్యక్తి.. కాకి రూపంలో వచ్చి.. కుటుంబ సభ్యులు తీసుకువచ్చిన పదార్థలను స్వీకరిస్తాడని తెలంగాణ ప్రాంతంలో బలంగా నమ్ముతారు. కొన్ని ప్రాంతాల్లో కుక్క వచ్చి తాకినా ఇలానే చనిపోయిన వ్యక్తే వచ్చాడని నమ్ముతారు.
ఇక గడ్డం సతీష్ రాసిన కథలో.. హీరో మనవడు. అతడి తాత మల్లయ్య మృతి చెందుతాడు. ఇక అతడు మృతి చెందిన మూడో రోజున అతడి కుటుంబ సభ్యులు, బంధువులు అందరు కలిసి వాగు ఒడ్డుకు వెళ్తారు. అక్కడ మల్లయ్య కుమారుడు.. తండ్రి బతికుండగా తినే పదార్థాలు, కల్లు, బీడీలు, టీ, బన్ వంటి వాటిని ఓ విస్తరాకులో పెట్టి కాకి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాకి వచ్చి ముడితే కానీ.. మల్లయ్య బంధుగణం అంతా ఇళ్లుకు వెళ్లి మిగతా పనులు చూసుకునే అవకాశం లేదు. చనిపోయిన వ్యక్తి మనసులో కోరిక తీరకపోతే.. రాడని బలంగా నమ్ముతారు. ఇది పచ్చిక కథ. ఇదే కథాంశంతో బలగం తెరకెక్కింది. కానీ మీడియాలో వచ్చిన కథ, బలగం క్లైమాక్స్ రెండు వేర్వురు. మీడియాలో వచ్చిన కథలో కాలుష్యం, దాని వల్ల అంతరించిపోతున్న జీవరాశి గురించి కూడా చర్చిస్తే.. బలగం క్లైమాక్స్ ఇందుకు భిన్నంగా ఉంది.
కానీ మూల కథ మాత్రం.. చావు, చనిపోయిన వ్యక్తి ఆత్మ శాంతి కోసం పెట్టే భోజనం చుట్టూనే తిరుగుతుంది. దాంతో గడ్డం సతీష్ మూల కథ అని చెప్పి తన పేరు వేస్తే బాగుండు అంటున్నాడు. ఈ వివాదంపై వేణు స్పందించాడు. తాను పత్రికలో స్పోర్ట్స్, సినిమా పేజీలు మాత్రమే చదువుతానని.. పచ్చిక కథ తాను చదవలేదని తెలిపాడు. బలగం కథ తెలంగాణ సంప్రదాయం నుంచి పుట్టిందని.. పిట్ట ముట్టడం సంప్రదాయం ఇక్కడ తరాలుగా ఉందని.. ఇది ప్రతి తెలంగాణ ఇంట్లో జరిగే కథే.. కాపీ కాదు అని క్లారిటీ ఇచ్చాడు. వీరిద్దరి వాదనలు ఎలా ఉన్నా సినిమా మాత్రం సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.