సినీ నటి కరాటే కళ్యాణి – యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రాంక్ వీడియోల పేరుతో బూతు వీడియోలు తీసి.. ఆడవాళ్లని అసభ్యకరంగా చూపిస్తూ వాళ్లని వాడుకుంటూ అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నాడంటూ శ్రీకాంత్ రెడ్డిపై కరాటే కళ్యాణి తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అలాగే అతనిపై దాడికి పాల్పడి వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలో యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి కూడా కరాటే కళ్యాణిపై ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం వీరి వివాదం కొనసాగుతోంది.
తాజాగా కరాటే కళ్యాణితో తనకు ప్రాణభయం ఉందంటూ మరో బాధితుడు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. ఈ ఫిర్యాదు విషయమై ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో ఓ యువతిపై అత్యాచారం జరిగిన కేసు ఇంకా కోర్టులో నడుస్తోంది. అయితే.. కేసు పూర్తవక ముందే ఆ కేసుకు సంబంధించిన బాధితురాలి ఫొటోలు, వివరాలను అప్పట్లో కరాటే కళ్యాణి బయటపెట్టింది. వెంగళరావునగర్ లో ఉంటున్న కర్నూల్కు చెందిన నితేష్ అనే వ్యక్తి బాధితురాలి వివరాలను రహస్యంగా ఉంచకుండా మీడియాకు ముందు ఎందుకు పెట్టావంటూ కళ్యాణిని ప్రశ్నించాడని సమాచారం.
ఈ నేపథ్యంలో నన్ను అడగడానికి నువ్వెవరంటూ కరాటే కళ్యాణి ఎదురు ప్రశ్నించిందని.. అందుకే బాధితుడు నితేష్ జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడని తెలుస్తుంది. దీంతో నితేష్ పై కోపం పెంచుకున్న కళ్యాణి తనపైనే ఫిర్యాదు చేస్తావా.. నీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడిందని ఫిర్యాదులో తెలిపాడు. అయితే.. ఇటీవలే యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డితో జరిగిన వివాదంలో.. కరాటే కళ్యాణి పై కేసు నమోదైనట్లు తెలుసుకున్న నితేష్ తనకు కూడా ఆమెతో ప్రాణభయం ఉందంటూ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.