సినీ ప్రేక్షకులు ఈ ఏడాది ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘ఆదిపురుష్’ ఒకటి. ఇప్పటికే రిలీజ్ డేట్ను ఫిక్స్ చేసుకున్న డార్లింగ్ మూవీకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా ‘ఆదిపురుష్’. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విజువల్ వండర్గా రూపొందిన ఈ మూవీని టీ సిరీస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించింది. జూన్ 16వ తేదీన బిగ్ స్క్రీన్స్లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది ‘ఆదిపురుష్’. ఈ చిత్ర విడుదలకు ఇంకా 20 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. అయినా మూవీ టీమ్ ఇంకా ప్రమోషన్స్ మొదలుపెట్టలేదు. అయితే ‘ఆదిపురుష్’ థియేట్రికల్ హక్కులకు సంబంధించి ఒక అప్డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా ఉభయ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ను ఒక బడా నిర్మాణ సంస్థ భారీ ధరకు దక్కించుకుందని తెలుస్తోంది. ఈ రైట్స్ కోసం ఏకంగా వందల కోట్లు ఖర్చు పెట్టిందట ఆ సంస్థ.
‘ఆదిపురుష్’ మూవీ ఏపీ, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ ఏకంగా రూ.170 కోట్లకు అమ్ముడయ్యాయని సమాచారం. ఈ చిత్ర హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తీసుకుందని టాలీవుడ్ టాక్. ఒకవేళ ఇదే నిజమైతే డార్లింగ్ మూవీ రికార్డు సృష్టించిందనే చెప్పాలి. టాలీవుడ్ మూవీస్కు ఇరు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన థియేట్రికల్ హక్కుల అమ్మకాల విషయానికొస్తే.. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని రెండు రాష్ట్రాలకు కలిపి సుమారు రూ.226 కోట్లకు విక్రయించారు. ‘బాహుబలి’ని రూ.120 కోట్లు, ‘సాహో’ను రూ.124 కోట్లకు అమ్మారు. ఆ లెక్కన ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత స్థానం ‘ఆదిపురుష్’దేనని చెప్పొచ్చు. ఇకపోతే, ప్రభాస్ ప్రస్తుతం ‘సలార్’ సినిమాలో నటిస్తున్నారు. అలాగే మారుతి డైరెక్షన్లో ‘రాజా డీలక్స్’ అనే చిత్రంలోనూ యాక్ట్ చేస్తున్నారు. ‘ఆదిపురుష్’ థియేట్రికల్ రైట్స్ను దక్కించుకుందని చెబుతున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీనే.. ‘రాజా డీలక్స్’నూ నిర్మిస్తుండటం గమనార్హం.
REBEL STAR Rage 🌟 🥵#Prabhas #AdiPurush#AdipurushOnJune16th pic.twitter.com/PhurrfvzO9
— Fukkard (@Fukkard) May 28, 2023