ఆడదంటే ఆడదానికి శత్రువు అని ఈ తల్లి కూతుళ్లు నిరూపించారు. సెలబ్రెటీ హోదాలో ఉండి సాటి ఆడదాన్ని అని చూడకుండా మరదలినే చిత్ర హింసలకు గురి చేసిందో నటి. చివరాకరకు కోర్టు వీరిని దోషులుగా తేల్చి, రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే..
సినీ రంగుల ప్రపంచంలో తెర ముందు జీవితాలు, తెర వెనుక జీవితాలు వేరు వేరు. సినిమాలో ఉన్నట్లే బయట ఉంటారనుకోవడం పొరపాటు. సినిమాలో మంచి పాత్రలు వేస్తున్నారూ కదా అని వారిని మంచి వారని, చెడ్డ పాత్రలు వేస్తున్న వారినీ చెడు మనస్తత్వం కలిగి ఉంటారని అంచనా వేయకూడదు. అందుకు ఉదాహరణగా నిలిచారు చాలా మంది నటీనటులు. బయటకు గంభీరంగా కనిపించినప్పటికీ మంచి పనులు, కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. కానీ ఈ కన్నడ సీనియర్ నటి మాత్రం దీనికి భిన్నం. సినిమాల పరంగా చాలా అనుభవమున్న ఈ నటి.. సొంత మరదలినే చిత్ర హింసలకు గురిచేసింది.
వివరాల్లోకి వెళితే.. కన్నడ ప్రముఖ, సీనియర్ నటి అభినయపై వరకట్న వేధింపులు కేసు నమోదైంది. 1998లో అభినయ పెద్దన్నయ్య శ్రీనివాస్కు లక్ష్మీదేవి అనే మహిళతో వివాహమైంది. ఆ సమయంలో రూ. 80 వేలతో పాటు 250 గ్రాముల బంగారం ఇచ్చారు. అయితే ఆమెను మరింత కట్నం తీసుకురావాలని అభినయతో పాటు మరో సోదరుడు చెలమరాజు, ఆమె తల్లి జయమ్మ వేధించారు. దీంతో ఆమె 2002లో బెంగళూరు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. తనను తన తల్లిదండ్రుల వద్దే ఉండిపోవాలని అంటున్నారని, లేదంటే చంపేస్తామంటూ వాళ్లు బెదిరిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. విచారించిన కర్ణాటక హైకోర్టు 20 ఏళ్ల తర్వాత అనగా గత ఏడాది డిసెంబర్ లో ముగ్గురిని దోషులుగా ప్రకటిస్తూ..రెండేళ్ల జైలు శిక్ష వేసింది.
అయితే అప్పటి నుండి ఈ ముగ్గురు పరారీలో ఉన్నారు. వీరిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చాల్సి ఉండగా కనిపించకపోవడంతో వీరి కోసం పోలీసులు జల్లెడ పట్టారు. వీరి ఇంట్లో సోదాలు చేపట్టారు. ఎంతకూ వీరి ఆచూకీ లభించకపోవడంతో.. లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా నేరస్థులకు సంబంధించిన సమాచారం తెలియజేయాలని పోస్టర్లు కూడా అంటించారు. కన్నడలో పాపులర్ నటిగా పేరు తెచ్చుకున్న అభినయ.. 13వ ఏట ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కన్నడ నాట రొమాంటిక్ సినిమాలకు పేరుగాంచిన కాశీ విశ్వనాథ్ అనుభ సినిమాతో ఆమె సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. కొన్నాళ్ళు హీరోయిన్గా నటించిన అభినయ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది. ప్రస్తుతం పూర్తిగా సీరియల్స్కే పరిమితమైంది. ఇప్పుడు దోషిగా మారింది.