ప్రాణాంతక వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. కీమోథెరపీ లాంటి చికిత్స అందుబాటులో ఉన్నప్పటికీ క్యాన్సర్ను నయం చేయడం అంత సలువు కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ను తొలి దశలో గుర్తించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. ఇలా క్యాన్సర్ను త్వరగా గుర్తించి బయటపడిన వారిలో చాలా మంది సెలబ్రిటీలు కూడా ఉన్నారు. బాలీవుడ్ ఖల్ నాయక్ సంజయ్ దత్ కూడా ఈ కోవలోకే వస్తారు. సంజూ బాబాకు లంగ్ క్యాన్సర్ ఉన్నట్లు 2020లో బయటపడింది. కీమోథెరపీ ట్రీట్మెంట్తో ఆయన ఈ మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. తన చికిత్స అనుభవాలను ఇటీవల ఆయన వెల్లడించారు.
‘నాకు తరచూ వెన్ను నొప్పి వస్తుండేది. వేడి నీటి సీసా, నొప్పి నివారణ ఔషధాలతో చికిత్స చేశారు. అయితే ఒకరోజు నాకు శ్వాస ఆడలేదు. దీంతో వెంటనే నన్ను ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో నా వెంట భార్య మాన్యత లేదు. నా సిస్టర్స్ కూడా అక్కడ లేరు. అలాంటి వేళ ఉన్నట్లుండి ఓ యువకుడు వచ్చి ‘మీకు క్యాన్సర్ ఉంది’ అని చెప్పి వెళ్లిపోయాడు. నా పరిస్థితి గురించి తెలిసిన తర్వాత కీమోథెరపీ ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే చనిపోవడం నయమని అనుకున్నా’ అని సంజయ్ దత్ చెప్పుకొచ్చారు.
క్యాన్సర్కు చికిత్స అంత సులువు కాదని సంజయ్ దత్ అన్నారు. తమ కుటుంబంలో చాలా మందిని క్యాన్సర్ వ్యాధి మింగేసిందన్నారు. తన అమ్మ పాంక్రియాటిక్ క్యాన్సర్తో చనిపోయిందన్న సంజయ్.. భార్య రిచా శర్మ బ్రెయిన్ క్యాన్సర్తో మరణించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అందుకే తనకు క్యాన్సర్ అని తెలియగానే.. కీమోథెరపీ తీసుకోకూడదని అనుకున్నానని సంజూ బాబా పేర్కొన్నారు. చనిపోయినా ఫర్లేదు కానీ ఎలాంటి చికిత్స తీసుకోకూడదని డిసైడ్ అయ్యానని వెల్లడించారు. అయితే భార్య మాన్యతతోపాటు తోబుట్టువులు ప్రియా దత్, నమ్రతా దత్ మద్దతుగా నిలవడంతో కీమోథెరపీ చికిత్స తీసుకుని సంజయ్ దత్ బయటపడ్డారు. ఆ తర్వాత ‘కేజీఎఫ్ 2’ చిత్రంలో తన పాత్ర బ్యాలెన్స్ షూటింగ్ను పూర్తి చేశారు. ఆ సినిమా ఎంతపెద్ద హిట్టుగా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.