గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే అనేక పార్కులు ఉన్నాయి. సిటీలో పచ్చదనం పెంచడంతోపాటు ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకున్న కేసీఆర్ ప్రభుత్వం పార్కుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. నగరంలోని ప్రధాన ప్రాంతాలతోపాటు సరిహద్దున ఉన్న నారపల్లి, వనస్థలిపురం, బీఎన్ రెడ్డి లాంటి అనేక చోట్ల పార్కులను ఏర్పాటు చేసింది. ఈ పార్కుల్లో పాదచారుల కోసం వాక్ ట్రాక్తోపాటు చిన్న పిల్లలు ఆడుకోవడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. వీటికి ప్రజల నుంచి మంచి ఆదరణ కూడా దక్కింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో మరో సరికొత్త పార్క్ను జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేయనుంది.
కొత్త థీమ్తో ఇంటరాక్టివ్ సైన్స్ పార్క్ ఏర్పాటుకు జీహెచ్ఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మూడెకరాల విస్తీర్ణంలో రూపొందిస్తున్న ఈ పార్క్ను.. హైటెక్ సిటీ, సైబర్ టవర్స్ సమీపంలోని పత్రికానగర్, మెడికోవర్ ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేయనున్నారు. ఈ సైన్స్ పార్క్లో ఉచిత వైఫై సదుపాయంతోపాటు ఉద్యోగులు తమ ల్యాప్ట్యాప్లు తెచ్చుకుని వర్క్ చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక స్థలం కేటాయించనున్నారు. అలాగే ఛార్జింగ్ పాయింట్లనూ నెలకొల్పనున్నారు.
హైటెక్ సమీపంలో ఐటీ కంపెనీలతోపాటు హోటళ్లు, గెస్ట్ హౌస్లు, హాస్పిటళ్లు ఉన్న నేపథ్యంలో ఈ సైన్స్ పార్క్ అందరికీ ఉపయోగపడుతుందని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు. త్వరలో ఈ పార్క్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఈ పార్క్లో ఫ్రీ వైఫై సదుపాయం కల్పించడం విశేషమనే చెప్పాలి. సిటీలో ఎన్నో పార్కులు ఉన్నప్పటికీ ఎక్కడా లేనివిధంగా ఉచిత వైఫై ఇవ్వడం ప్రత్యేకంగా నిలుస్తోంది.
చుట్టూ చెట్లు, ప్రశాంతమైన వాతావరణంలో ఆఫీసు పని చేసుకునేందుకు ఉద్యోగులకు ఇంతకంటే మంచి ప్లేస్ దొరకదనే చెప్పాలి. ఒకవేళ కంపెనీలు అందుకు అనుమతిస్తే.. ఈ పార్క్కు ఉద్యోగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇన్ని సౌకర్యాలు అందిస్తున్నందున, ముఖ్యంగా ఫ్రీ వైఫై ఇస్తుండటంతో యువత ఈ పార్క్కు అధికంగా వచ్చే చాన్స్ ఉంది. మరి, ఉచిత వైఫై లాంటి అధునాతన సౌకర్యాలతో ఏర్పాటవుతున్న సైన్స్ పార్క్ నగరానికి తలమానికంగా నిలుస్తుందంటారా? దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.