సముద్రంలో భారీ చేపలు జాలర్లకు దొరకుతుంటాయి. కానీ పర్చూరు మండలం వీరన్నపాలెంలో ఉన్న మంచినీటి చెరువులో 30 కిలోల చేప చిక్కి అందరినీ అశ్చర్యానికి గురిచేసింది. వీరన్నపాలెంలో మంచినీటి చెరువు ఉంది. అందులో సహజసిద్ధంగా పెరిగిన చేపలను మూడేళ్ల తర్వాత వేలం ద్వారా విక్రయించారు. పాటపాడుకున్న కాంట్రాక్టర్ ఆదివారం జాలర్లతో చేపలు పట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒక్కసారిగా భారీ సైజులో చేపలు వలలో పడ్డాయి. 25 కిలోల వరకూ ఉన్న చేపలు పదికిపైన దొరికాయి. చెరువులో చిక్కిన ప్రతి చేప కూడా పది కిలోలకుపైన ఉంది. ముఖ్యంగా వీటిలో 30 కిలోలు ఉన్న చేప అందరినీ ఆకర్షించింది. ఈ జలాశయంలో దాదాపు అన్నీ 5 నుంచి 10 కేజీల మధ్య బరువున్న చేపలు ఉంటాయన్నారు మత్స్యకారులు.
మంచి నీటి చెరువులో మహా అయితే 10 నుంచి 15 కిలోలు ఉన్న చేపలు దొరకడమే అరుదు. అలాంటిది ఏకంగా 20 నుంచి 30 కిలోల బరువైన చేపలు దొరికితే! కానీ, ఇక్కడి చెరువులో ఎటు చూసినా అంతేస్థాయి చేపలు పట్టుబడుతున్నాయి. ముఖ్యంగా వీటిలో 30 కిలోలు ఉన్న చేపలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. మంచినీటి చెరువుల్లో సహజసిద్ధంగా పెరిగే చేపల కంటే భిన్నంగా, దాదాపుగా ముప్పై కిలోల బరువు తో పాటుగా అతి పెద్ద పరిమాణం కలిగిన చేపలు వలలకు చిక్కుతుండటంతో గ్రామస్థులు వీటిని కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు.