హిందువులకు ఇది తొలి పండుగ అంటే తొలి ఏకాదశి నుండి పండుగలు మొదలవుతాయి. ఈ రోజు ఇల్లును శుభ్రపరుచుకొని శుద్దిగా చేసుకుని విష్ణుమూర్తిని పూజిస్తారు. తొలిఏకాదశి రోజంతా ఉపవాసం ఉండి జాగరణ చేస్తారు. మరునాడు అంటే ద్వాదశి రోజు ఉదయం శ్రీ మహావిష్ణువును పూజించి తీర్థప్రసాదాలు సేవిస్తారు.
హిందువులకు తొలి పండుగగా ప్రఖ్యాతి గాంచిన తొలి ఏకాదశి రానే వచ్చింది. జూన్ 29న హిందువులు తొలి ఏకాదశి జరుపుకోనున్నారు. అయితే ఈ ఏకాదశికి ఓ ప్రత్యేకత ఉంది. సంవత్సరం మొత్తంలో 24 ఏకాదశులు వస్తాయి. వాటిలో ఆషాఢమాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశిని ‘తొలి ఏకాదశి’ అని పిలుస్తారు. దీనినే ‘శయన ఏకాదశి’ అని కూడా పిలుస్తారు. ఏకాదశిరోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు ఉపక్రమించే రోజు కావున శయన ఏకాదశి అంటారు. హిందువులకు ఇది తొలి పండుగ అంటే తొలి ఏకాదశి నుండి పండుగలు మొదలవుతాయి. ఈ రోజు ఇల్లును శుభ్రపరుచుకొని శుద్దిగా చేసుకుని విష్ణుమూర్తిని పూజిస్తారు. తొలిఏకాదశి రోజంతా ఉపవాసం ఉండి జాగరణ చేస్తారు. మరునాడు అంటే ద్వాదశి రోజు ఉదయం శ్రీ మహావిష్ణువును పూజించి తీర్థప్రసాదాలు సేవిస్తారు. ఆ తర్వాత భోజనం చేసి ఉపవాస దీక్ష వదిలేస్తారు. ఇలా చేస్తే ఎన్నో జన్మాల పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం. తొలి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లి మళ్లీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడు.
ఏకాదశికి పేరు ఎలా వచ్చిందంటే..
ఈ కథ ప్రాచుర్యంలో ఉంది. కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. అతడు బ్రహ్మవరంతో రుషులపై దేవతలపై దాడి చేసి హింసించేవాడు. ఆ రాక్షసుడితో శ్రీ మహావిష్ణువు వెయ్యేళ్లు పోరాడి, అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీ హరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించింది. ఆ కన్య రాక్షసుణ్ని అంతం చేసిందట. దానికి సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా ఆ కన్య తాను విష్ణుప్రియగా లోకంలో అందరిచేత పూజింపబడాలని కోరుకుందట. అప్పటి నుంచి ఆమె ‘ఏకాదశి’ తిథిగా వ్యవహారంలోకి వచ్చింది.. నాటి నుంచి సాధువులు, భక్తజనులు ‘ఏకాదశి’ వ్రతం ఆచరించి విష్ణుసాయుజ్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అంబరీషుడు, మాంధాత, తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు.
ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకు చేయాలి?
ఏకాదశి అంటే పదకొండు. ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం పదకొండు. వీటిని ఆధీనంలోకి తీసుకువచ్చి ఒకటిగా చేసి, దేవునికి నివేదన చేయాలి. అంటే ఉపవాస దీక్షలో ఉంటాం కాబట్టి ఆరోజు మొత్తం విష్ణునామ స్మరణ చేయాలి. నామస్మరణ చేస్తూ.. జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను, మనస్సును కలిపి ఏకోణ్ముఖంగా పనిచేసే సమయాన్ని ఏకాదశిగా చెబుతారు. దీని ద్వారా మనో నిగ్రహం కలుగుతుంది. ఈ సమయంలో కలిగిన మనో నిగ్రహం వలన మన జీవితంలో జరిగే పరిణామాలను ఎదుర్కొనే స్వభావం మనకు అలవాటు అవుతుంది. ఉపవాసం అంటే అర్థం ఉప అంటే సమీపం, దగ్గర. విష్ణునామస్మరణ చేస్తాం కాబట్టి మనస్సు విష్ణువు దగ్గరే ఉండాలి. అవసరం లేని వస్తువులను చూడాలనిగాని, వినాలనిగాని తినాలనిగాని అనిపించదు. ఇంద్రియాలపై నిగ్రహం పెంచుకునేందుకు మంచి తిథిగా ఏకాదశిని పేర్కొంటారు.
ఈ రోజు మనసును కేంద్రీకరించే శక్తిని పెంచుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. ఇంద్రియ నిగ్రహం పెరుగుతుంది. మనిషికి బద్ధకం తొలగిపోతుంది. రోగాలు దరిచేరవు. ఈ నాలుగు నెలలు అత్యంత పవిత్రంగా చాతుర్మాసదీక్ష చేస్తారు. ప్రస్తుత కాలంలో ఈ దీక్షను మఠాధిపతులు, సన్యాసం తీసుకున్నవారు మాత్రమే ఆచరిస్తున్నారు. ఈ దీక్ష చేసేవారు నాలుగు నెలల పాటు ప్రయాణాలు చేయరు. ఆహార నియమాలను పాటిస్తారు. ఈ నెలలో ప్రకృతిలో చాలా మార్పులు వస్తాయి. సీజన్ మార్పుల వలన రోగాల బారిన పడే చాన్స్ ఉంటుంది. ఏకాదశి ఉపవాసం వలన జీర్ణకోశం శుద్దిజరిగి ఉత్తేజితమవుతుంది. మనస్సు ఇంద్రియనిగ్రహాన్ని పొందుతుంది. ఉపవాసం వలన మనం ఏవైనా రోగాల భారిన పడినపుడు డైటింగ్ సులభంగా అలవరచుకునే అవకాశం ఉంటుంది. ఆహార నియమాలు కూడా తొందరగా అవడుతాయి.
పేలపిండి ప్రత్యేకత
ఏకాదశి రోజున పేలపిండి తినే ఆచారం ఉంది. పేలాల్లో బెల్లం, యాలకుల పొడి చేర్చి పిండిలా చేసి తీసుకుంటారు. ఇది ఆరోగ్యానికి మంచిది. వ్యాధినిరోదక శక్తిని పెంపొందిస్తుంది.